
పిడుగుపాటుకు మహిళ మృతి
మరో వ్యక్తికి తీవ్ర గాయాలు
శివ్వంపేట(నర్సాపూర్): పిడుగుపాటుకు మహిళా కౌలు రైతు మృతి చెందింది. మరో వ్యక్తికి తీవ్ర గాయాలైన ఘటన మండల పరిధిలోని గూడూర్లో శుక్రవారం సాయత్రం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన కొత్తకుమ్మరి బాలమణి,శివరాజు దంపతులు, వీరి కొడుకు శ్రీకాంత్, తమ్ముడు శంకరయ్య అతడి భార్య సత్తమ్మ(45) కలిసి కౌలు భూమిలో వ్యవసాయ పనులు చేస్తున్నారు. పిడుగు పడిన శబ్దాలు వస్తుండటంతో సత్తమ్మ, శ్రీకాంత్ చింత చెట్టు కిందికి వెళ్లారు. వారిపై పిడుగు పడటంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. కొద్ది దూరంలో ఉన్న బాలమణికి సైతం స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే కుటుంబ సభ్యులు శివ్వంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. సత్తమ్మ ప్రాణాలు కాపాడేందుకు వైద్య సిబ్బంది సీపీఆర్ చేసినప్పటికీ ప్రయోజనం లేకపోవడంతో అంబులెన్స్లో నర్సాపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండంగా మార్గమధ్యలో మృతి చెందింది. శ్రీకాంత్ కాళ్లు కదపలేక షాక్లో ఉండగా అతన్ని చికిత్స నిమిత్తం హైదరాబాద్లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
11 మేకలు మృతి...
నంగునూరు(సిద్దిపేట): పిడుగు పాటుకు గురై 11 మేకలు మృతి చెందిన ఘటన శుక్రవారం ఘణపూర్లో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రైతులు ఏలేటి లక్ష్మారెడ్డి, లింగంపల్లి కొ మురయ్య తన వ్యవసాయ బావి వద్ద మేకలు మేపుతున్నారు. సాయంత్రం ఒక్కసా రిగా వర్షం కురవడంతో మేకలు సమీపంలోని చెట్ల కిందికి వెళ్లాయి. ఈ క్రమంలో చెట్టుపై పిడుగు పడటంతో లక్ష్మారెడ్డికి చెందిన ఏడు, సంపత్కు చెందిన నాలుగు మేకలు అక్కడికక్కడే మృతి చెందాయి. రైతులు మరో చెట్టు కింద ఉండటంతో వారికి ప్రాణాపాయం తప్పింది.
చర్చిపై...
నారాయణఖేడ్: ఖేడ్ మండలం హుక్రాన (జి) గ్రామ చర్చి పరిసర ప్రాంతాల్లో శుక్రవారం పిడుగు పడింది. దీంతో చర్చి జెండా కాలిపోవడంతో పాటు సౌండ్ సిస్టానికి సంబంధించిన లౌడ్ స్పీకర్లు కింద పడ్డాయి. పరిసరాల్లో ఎవ్వరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది.

పిడుగుపాటుకు మహిళ మృతి