
కబ్జా చేస్తే ఊరుకోం
● అధికారులు చర్యలు తీసుకోకపోతే గుడిసెలు వేయిస్తాం ● బీరంగూడ అఖిలపక్ష నేతల హెచ్చరిక
పటాన్చెరు: అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని బీరంగూడ దేవాలయం పరిసరాల్లో ప్రభుత్వ స్థలాలు కబ్జాకు గురవుతున్నాయని బీరంగూడ అఖిలపక్ష నాయకులు ఆరోపించారు. బీరంగూడ గుట్ట కమాన్ వద్ద మల్లికార్జున్ వెల్ఫేర్ అసోసియేషన్ భవనంలో బుధవారం పట్టణ తాజా మాజీ వైస్ చైర్మన్ నందారం నరసింహగౌడ్, బీజేపీ రాష్ట్ర నాయకులు అదేల్లి రవీందర్, తాజా మాజీ కౌన్సిలర్ ఎడ్ల రమేశ్తోపాటు బీరంగూడ గ్రామ పెద్దలు విలేకరులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అధికారుల అవినీతి కారణంగానే ప్రభుత్వ భూమి మాయమవుతుందన్నారు. అధికారులు సర్కారు భూములను కాపాడకపోతే తామే పేద ప్రజలతో గుడిసెలు వేయించి కబ్జాలు చేయిస్తామని హెచ్చరించారు. అధికారులు తప్పుడు సర్వేలతో ప్రభుత్వ భూమిని అన్యాక్రాంతం చేసేందుకు కబ్జాదారులకు వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. అధికారులు స్పందించకపోతే హైడ్రా కమిషనర్ వద్దకు వెళ్తామని, అవసరమైతే హైకోర్టుకు వెళ్తామని వారు చెప్పారు. అమీన్పూర్ కొత్తగా మండలంగా రూపుదిద్దుకున్నప్పటికీ ఇప్పటివరకు ఒక్క మండల స్థాయి ప్రభుత్వ కార్యాలయానికి సొంత భవనం లేని దుస్థితి ఉందన్నారు. అమీన్పూర్ తహసీల్దార్ కార్యాలయం బీరంగూడ కమ్యూనిటీ హాల్లో నిర్వహిస్తున్నారని, పోలీస్ స్టేషన్ను ఇక్రిశాట్ కాలనీ కమ్యూనిటీ హాల్లో నిర్వహిస్తున్నారని, ఒక్కక్రీడా మైదానం లేదని ఇలా అనేక అవసరాలున్నాయని అదేల్లి రవీందర్ వివరించారు. బీరంగూడ అమీన్పూర్లో ఎంతోమంది పేదలున్నారని వారికి సొంత ఇళ్లు లేవని గుర్తు చేశారు.