నిమ్జ్‌ లబ్ధిదారుల ఎంపిక షురూ | - | Sakshi
Sakshi News home page

నిమ్జ్‌ లబ్ధిదారుల ఎంపిక షురూ

Jun 11 2025 11:51 AM | Updated on Jun 11 2025 11:51 AM

నిమ్జ్‌ లబ్ధిదారుల ఎంపిక షురూ

నిమ్జ్‌ లబ్ధిదారుల ఎంపిక షురూ

● సీఎం రేవంత్‌రెడ్డి హామీ అమలు దిశగా అధికారుల చర్యలు ● 3,300 మంది జాబితా సిద్ధం.. ఎంపీడీఓలకు అప్పగింత

సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: జాతీయ పెట్టుబడులు, ఉత్పాదక మండలి (నిమ్జ్‌) నిర్వాసితులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు దిశగా అడుగులు పడుతున్నాయి. ఈ నిమ్జ్‌లో భూములు కోల్పోతున్న నిర్వాసితుల్లో అర్హులైన వారికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇటీవల జహీరాబాద్‌లో జరిగిన బహిరంగ సభలో రేవంత్‌రెడ్డి ఈ మేరకు ప్రకటన చేశారు. ఈ నిర్వాసితుల సమస్యలు మంత్రి దామోదర రాజనర్సింహ తన దృష్టికి తెచ్చారని ఈ ఇళ్ల పట్టాలు ఇప్పించే బాధ్యతలను టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డికి అప్పగిస్తున్నట్లు రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. సీఎం ఇచ్చిన ఈ హామీ అమలు చేసేందుకు జిల్లా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఇందులోభాగంగా భూములు కోల్పోయిన నిర్వాసితుల జాబితాలను అధికారులు రూపొందిస్తున్నారు. ఇప్పటికే సుమారు 3,300 మంది నిర్వాసితుల జాబితాలను భూసేకరణ స్పెషల్‌ డిప్యూటీ కార్యాలయం అధికారులు ఆయా మండలాల ఎంపీడీఓలకు అప్పగించారు. మిగిలిన నిర్వాసితుల జాబితాలను కూడా త్వరలో అప్పగించనున్నారు.

వారిలో అర్హులెంత మంది?

భూసేకరణ అధికారులు ఇచ్చిన జాబితాలో ఇందిర మ్మ ఇళ్ల పథకానికి అర్హులు ఎంతమంది ఉన్నారో గుర్తించేందుకు ఎంపీడీఓలు కసరత్తు చేస్తున్నారు. ఈ నిర్వాసితుల్లో అనర్హులు ఎవరైనా ఉన్నారా? అనే దానిపై ఆరా తీస్తున్నారు. భూములు కోల్పోయిన వారిలో కొందరు హైదరాబాద్‌, సంగారెడ్డివంటి చోట్ల నివాసముంటున్నారు. ఇలాంటి వారిని మినహాయించి స్థానికంగా నివాసముంటున్న నిర్వాసితులకే ఈ గృహాలను మంజూరు చేయనున్నారు. వీరిలో ఇంటి స్థలం ఉన్న వారు ఎంత మంది? స్థలం లేని వారు ఎంత మంది తేల్చనున్నారు. స్థలం లేనివారి కోసం అవసరమైన ప్రభుత్వ స్థలాల గుర్తింపు వంటి వాటిపై అధికారులు ఆయా మండలాల రెవెన్యూ, ఎంపీడీఓలు దృష్టి సారించారు.

5,612 మంది నిర్వాసితులు

మూడు లక్షల ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనే లక్ష్యంగా రూ.31 వేల కోట్ల పెట్టుబడులతో ఏర్పాటు చేస్తున్న నిమ్జ్‌ కోసం మొత్తం 12,635 ఎకరాల భూములను సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం విదితమే. రాష్ట్రంలో భారీ ఎత్తున భుములు సేకరిస్తున్న వాటిలో నిమ్జ్‌ కూడా ఒకటి. జహీరాబాద్‌ ప్రాంతంలో న్యాల్‌కల్‌, ఝరాసంగం మండలాల్లోని 12 గ్రామాల పరిధిలో ఈ భూములను సేకరిస్తున్నారు. 5,612 మంది రైతులు ఈ నిమ్జ్‌లో భూములు కోల్పోతున్నారు. ఇందులో అర్హులైన వారందరికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement