
‘మహీంద్ర’లో పోరు రసవత్తరం
జహీరాబాద్: జహీరాబాద్లోని మహీంద్ర అండ్ మహీంద్ర కర్మాగారంలో కార్మిక సంఘం ఎన్నికల పోరు రసవత్తరంగా మారింది. 5న ఎన్నికలను నిర్వహించేందుకు కార్మిక శాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఎన్నికల్లో అధికార సీఐటీయూ, ఐఎన్టీయూసీ యూనియన్లు విజయం కోసం శథ విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నాయి. గత ఎన్నికలతో పోల్చితే ఈ ఎన్నికలను ఆయా యూనియన్లు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. 1983–84 సంవత్సరంలో 150 మంది పర్మనెంట్ కార్మికులతో ప్రారంభమైన కర్మాగారంలో ప్రస్తుతం 543 మంది కార్మికులు ఉన్నారు. 1985 నుంచి కార్మిక సంఘం ఎన్నికలను నిర్వహిస్తూ వస్తున్నారు. ఎన్నికల్లో ఐఎన్టీయూసీ ఆరు పర్యాయాలు, సీఐటీయూ ఆరు పర్యాయాలు, హెచ్ఎంఎస్ రెండు పర్యాయాలు, టీఎంఎస్ రెండు పర్యాయాలు విజయం సాధించాయి.
ఇప్పటికే గేట్ మీటింగ్లు పూర్తి
కార్మిక సంఘం ఎన్నికల్లో పోటీ పడుతున్న సీఐటీయూ, ఐఎన్టీయూసీలు ఇప్పటికే గేట్ మీటింగ్లను నిర్వహించి గెలిపిస్తే తాము చేయబోయే ప్రధాన పనుల గురించి కార్మికులకు సందేశం ఇచ్చారు. ఇప్పటి వరకు తాము మంచి అగ్రిమెంట్ చేసి పెట్టామని సీఐటీయూ నేత చుక్క రాములు చెబుతున్నారు. ఐఎన్టీయూసీ తరఫున పోటీ చేస్తున్న రాష్ట్ర నేత జనక్ప్రసాద్ మాత్రం రాష్ట్రంలో తమ యూనియన్ అధికారంలో ఉన్నందున కార్మికుల సమస్యలను పరిష్కరించడం సులభవుతుందంటున్నారు. ఆయా యూనియన్ నాయకులు కార్మికుల ప్రసన్నం కోసం ప్రయత్నిస్తున్నారు. ఎవరికి వారు విజయం కోసం వ్యూహరచన చేస్తున్నారు.
4వ వరుస విజయం కోసం సీఐటీయూ వ్యూహం
పూర్వ వైభవం కోసం ఐఎన్టీయూసీ కసరత్తు
కార్మిక సంఘం ఎన్నికలకు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆయా యూనియన్ల నాయకులు