 
															లక్కీభాస్కర్లకు గాలం!
రంగంలోకి సిండికేట్ వ్యాపారులు
శేరిలింగంపల్లికి చెందిన ఓ మద్యం వ్యాపారి ఎప్పటిలాగే ఈసారి కూడా వేర్వేరు క్లస్టర్లలోని పది మద్యం దుకాణాలకు టెండర్లు వేశాడు. లక్కీడ్రాలో ఆయనకు ఒక్కషాపు కూడా దక్కలేదు. పదేళ్లుగా ఇదే వ్యాపారంలో ఉండడం.. వేరే వ్యాపారంలోకి వెళ్లేందుకు ఇష్టం లేకపోవడంతో ఎలాగైనా ఏదో ఒక షాపును చేజిక్కించుకోవాలని భావించాడు. మద్యం వ్యాపారంలో ఇప్పటి వరకు ఎలాంటి అనుభవం లేకపోయినా లక్కీడ్రాలో షాపును దక్కించుకున్న వ్యక్తికి ఏటా రూ.కోటి ఆఫర్ చేయడంతో పాటు దరఖాస్తు ఫీజు రూ.3 లక్షలతో పాటు గుడ్విల్ చెల్లింపులకు సిద్ధమయ్యాడు. ఇందుకు నిరాకరించిన సదరు లక్కీభాస్కర్పై స్థానికంగా ఉన్న ఓ కీలకనేత ద్వారా బెదిరింపులకు దిగాడు. చేసేది లేక చివరికి అతను సిండికేట్కు తలొంచాల్సి వచ్చింది.
సికింద్రాబాద్కు చెందిన ఓ మద్యం వ్యాపారి పలువురి పేరున జాతకం చూపించి మరీ టెండర్లు దాఖలు చేశాడు. ఫీజుల రూపంలో రూ.కోటి వరకు ఖర్చు చేశాడు. అదృష్టానికి బదులు.. ఈసారి దురదృష్టం వెంటాడింది. లక్కీడ్రాలో ఒక్క షాపు కూడా దక్కలేదు. లాటరీలో మద్యం షాపును దక్కించుకున్న ఓ వ్యక్తిని కలిశాడు. షాపులో అంత ఆదాయం వచ్చే అవకాశం లేకపోయినా కేవలం వ్యాపారానికి దూరంగా ఉండలేక లక్కీభాస్కర్ పెట్టిన డిమాండ్లకు అంగీకరించాడు.
సాక్షి, రంగారెడ్డి జిల్లా: లక్కీ డ్రాలో వైన్షాపులు దక్కించుకున్నవారి నుంచి ఆయా షాపులను సొంతం చేసుకునేందుకు సిండికేట్ వ్యాపారులు రంగంలోకి దిగారు. ఈ వ్యాపారంలో కనీస అనుభవం లేని, తొలిసారిగా టెండర్లలో పాల్గొన్న లక్కీ భాస్కర్లను లక్ష్యం చేసుకుంటున్నారు. వారికి పలు ఆఫర్లు సైతం ఇస్తున్నారు. ఏడాదికి రూ.కోటి సహా దరఖాస్తు ఫీజు రూ.3 లక్షలతో పాటు రెండేళ్లు గుడ్విల్ చెల్లించేందుకు సిద్ధమవుతున్నారు. ఇచ్చేందుకు నిరాకరిస్తున్న వాళ్లకు ఈ సిండికేట్ల నుంచి ఒత్తిడి మొదలైంది.
ఆఫర్లకు తలొగ్గని వారికి తప్పని ఒత్తిళ్లు
హైదరాబాద్, సికింద్రాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, సరూర్నగర్, శంషాబాద్, వికారాబాద్ ఎకై ్సజ్ డివిజన్ల పరిధిలో 693 మద్యం షాపులకు టెండర్లు పిలువగా మొత్తం 36,266 మంది పోటీ పడ్డారు. టెండర్లు దాఖలు చేసిన వారిలో మహిళలు కూడా ఉన్నారు. అత్యధిక దరఖాస్తులు సరూర్నగర్, శంషాబాద్ ఎకై ్సజ్ డివిజన్ల నుంచే వచ్చాయి. ఇప్పటికే ఈ లిక్కర్ వ్యాపారంలో అనుభవం ఉన్న వాళ్లు పెద్ద సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నప్పటికీ అదృష్టం వరించకపోవడంతో ఇతరులపై ఆధారపడాల్సి వచ్చింది. కొత్తగా షాపులు దక్కించుకున్న వాళ్లను గుర్తించి పలు ఆఫర్లు ఇస్తున్నారు. అయినా ఇచ్చేందుకు నిరాకరించిన వాళ్లకు స్థానిక నేతలు, రాజ కీయ అనుచరుల నుంచి ఒత్తిళ్లు తీసుకొస్తున్నారు. చేసేది లేక కొంత మంది లొంగిపోతుండగా, మరికొంత మంది వేచి చూసే ధోరణిలో ఉన్నారు. అంతర్గతంగా ఇంత జరుగుతున్నా.. ఆయా ఎకై ్సజ్ డివిజన్ల అధికారులు మాత్రం తమకేమీ తెలియదన్నట్లుగా వ్యవహరిస్తుండడం కొసమెరుపు. మరోవైపు దుకాణాలు దక్కించుకున్న వాళ్లకు షాపింగ్ కాంప్లెక్స్ల యజమానులు చుక్కలు చూపిస్తున్నారు. అప్పటి వరకు రూ.10 వేల లోపే ఉన్న నెలవారీ అద్దెలను అమాంతం పెంచేస్తున్నారు.
మద్యం షాపులు దక్కించుకున్న వారితో భేరసారాలు
ఒక్కో దుకాణానికి భారీ మొత్తంలో ఆఫర్
అప్లికేషన్ ఫీజు సహా గుడ్విల్ ఇచ్చేందుకు అంగీకారం
ఒప్పుకోని వాళ్లపై పలుకుబడితో ఒత్తిళ్లు

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
