 
															‘పార్ట్టైమ్’ పాఠాలు!
హుడాకాంప్లెక్స్: చారిత్రక విక్టోరియా మెమోరియల్ స్కూల్ (వీఎం హోమ్) విద్యార్థులను ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. అర్హత, అనుభవం ఉన్న రెగ్యులర్ టీచర్లను నియమించకపోవడంతో పార్ట్టైమ్ ఉద్యోగులతో నెట్టుకొస్తున్నారు. పదో తరగతి పరీక్షల్లో పలువురు విద్యార్థులు ఫెయిల్ అవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. జిల్లా విద్యాశాఖ నుంచి డిప్యూటేషన్పై సబ్జెక్టు నిపుణులను ఇక్కడికి పంపే అవకాశం ఉన్నా పట్టించుకోవడం లేదు. హోమ్ నిర్వాహకుల తీరుతో విద్యార్థులు నష్టపోవాల్సి వస్తోంది.
750 మంది విద్యార్థులు
తల్లిదండ్రులు లేని అనాథలకు వీఎం హోం పెద్ద దిక్కుగా నిలుస్తోంది. 120 ఏళ్ల చారిత్రక నేపథ్యం ఉన్న ఈ ప్రభుత్వ సంక్షేమ పాఠశాలలో ప్రస్తుతం 750 మందికిపైగా విద్యార్థులు వివిధ తరగతుల్లో విద్యాభ్యాసం సాగిస్తున్నారు. సాంఘీక సంక్షేమశాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఈ పాఠశాలలో ఏళ్లుగా నియామకాలు చేపట్టలేదు. విధిలేని పరిస్థితుల్లో నిర్వాహకులు పార్ట్టైం ప్రాతిపదికన నియామకాలు చేపట్టి విద్యార్థులకు పాఠ్యాంశాలు బోధిస్తున్నారు. ప్రతి 40 మందికి ఒక రెగ్యులర్ ఉపాధ్యాయుడు ఉండాల్సి ఉండగా, ప్రస్తుతం ప్రిన్సిపాల్ సహా మరో ఇద్దరే ఉన్నారు. మిగిలిన వారంతా పార్ట్టైం కింద వచ్చిన వారే.
పర్యవేక్షణ లేకపోవడంతో..
పాలకమండళ్లు మారిన ప్రతీసారి ఎవరికి నచ్చిన వాళ్లను వారు పార్ట్టైం టీచర్లుగా నియమించుకుంటూ పోతున్నారు. అనుభవం, అర్హతను పరిగణలోకి తీసుకోకపోవడంతో వారు చెప్పే పా ఠ్యాంశాలు పిల్లలకు అర్థంకాని పరిస్థితి నెలకొంది. డీఎస్సీ ద్వారా ఎంపికై విద్యాశాఖ పరిధిలో పని చేస్తున్న సీనియర్ ఉపాధ్యాయులను ఇంటర్నల్ డిప్యూటేషన్పై రప్పించుకునే అవకాశం ఉన్నా అటువైపు దృష్టి సారించడం లేదు. పాఠశాలలోనే కాదు వసతి గృహంలోనూ రెగ్యులర్ ఉద్యోగులు ఒక్కరు కూడా లేరు. పిల్లలపై సరైన పర్యవేక్షణ లేకపోవడంతో తరచూ పారిపోతున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి.
ఆరో నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్ వేసవి విడిది కోసం సరూర్నగర్లోని 70 ఎకరాల విస్తీర్ణంలో విశ్రాంత భవనం నిర్మించారు. దక్కన్శైలిలో 420 అడుగుల పొడవు, 285 అడుగుల వెడల్పు, 32 అడుగుల ఎత్తు, రెండు అంతస్తుల్లో నిర్మించారు. బ్రిటీష్ రాణి విక్టోరియా మరణం (1901) తర్వాత ఆమె స్మృత్యార్థం దీన్ని అనాథ బాలల ఆశ్రమంగా మార్చారు. 1905 ఫిబ్రవరి 14న ప్రారంభించారు. వరంగల్ నుంచి 54 మంది అనాథలను ఇక్కడికి తరలించారు. 1953లో నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ దీన్ని సందర్శించి, అప్పటి వరకు వాడుకలో ఉన్న ‘ఆర్పరేజ్’ అనే పదాన్ని తొలగించి హోమ్గా మార్చారు. 2017లో రాచకొండ పోలీసు కమిషనరేట్కు ఇక్కడ కొంత భూమిని కేటాయించగా, పూర్వ విద్యార్థుల ఆందోళనతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. 120 సంవత్సరాల చారిత్రక భవనం ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకుంది.
వీఎం హోమ్లో ఉపాధ్యాయుల కొరత
తాత్కాలిక ఉద్యోగులతో పాఠ్యాంశాల బోధన
అయోమయంలో విద్యార్థుల భవిత
పట్టించుకోని సంక్షేమశాఖ

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
