
పత్తి సాగుకు సమయమిదే..
నవాబుపేట: పత్తి సాగుకు సరైన సమయమిదేనని.. తగు జాగ్రత్తలు తీసుకుంటే రైతులకు తెల్లబంగారం లాభాలు ఆర్జించి పెడుతుందని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. ప్రస్తుతం వానాకాలం సీజన్లో రైతులు అధికంగా పత్తి సాగుకు మొగ్గు చూపుతారు. కానీ ఏడాది గతంతో పోల్చితే తగ్గే అవకాశం ఉందని వెల్లడిస్తున్నారు. గత ఏడాది సరైన సమయంలో వర్షాలు కురువక దిగుబడులు తగ్గడం.. ఖర్చులు పెరగడంతో ఆశించిన లాభాలు రాలేదు. దీంతో మొక్కజొన్న సాగుకు రైతులు ఆసక్తి చూపుతున్నారని అధికారులు పేర్కొంటున్నారు. గతేడాది వానాకాలం మండల పరిధిలో 21,539 ఎకరాల్లో పత్తి సాగు చేయగా.. మొక్క జొన్న 744 ఎకరాలకే పరిమితమైంది. ఈ సీజన్లో 19,230 ఎకరాల్లో పత్తి 2,317 ఎకరాల్లో మొక్కజొన్న సాగుచేయనున్నట్లు వ్యవసాయాధికారులు అంచనా వేస్తున్నారు.
నల్లరేగడి భూములు అనుకూలం
పత్తి సాగుకు నల్లరేగడి భూములు అనుకూలమైనవి. నీటి సదుపాయం కలిగిన సారవంతమైన ఎర్రనేలల్లోనూ వేసుకోవచ్చు. సమస్యాత్మక భూములు తరుచుగా నీటి ఎద్దడికి గురయ్యే నేలలు, మురుగునీటి పారుదల సౌకర్యం లేని నేలల్లో సాగు చేపట్టొద్దు. తొలకరి వర్షాలు పడిన తర్వాత పొలాన్ని రెండు నుంచి మూడుసార్లు కలియ దున్నుకోవాలి. విత్తనాలు ఏ పద్ధతి లో వేసుకోవాలన్నది విత్తన రకం, నేల స్వభావంపై ఆధారపడి ఉంటుంది. అవకాశం ఉన్నవారు ఆఖరి దుక్కిలో ఎకరానికి పది టన్నుల పశువుల ఎరువు వేయాలి. చివరి దుక్కిలోనే 150 కిలోల సింగల్ సూపర్పాస్పేట్ వేసి కలియదున్నాలి. భూమి బాగా తడిసిన తర్వాత అంటే 60 నుంచి 70 మీల్లీటర్ల వర్ష పాతం నమోదైన ఐదు రోజుల తర్వాత విత్తనాలు వేసుకోవాలి. నల్లరేగడి నేలల్లో 60 నుంచి 70 శాతం తేమ ఉంటేనే ఎర్రనేలల్లో 50 నుంచి 60 శాతం తేమ ఉంటే విత్తనం వేసుకోవచ్చు.
విత్తన ఎంపిక
పత్తిలో చాలా రకాలున్నాయి. నమ్మకమైన కంపెనీలు, డీలర్ల నుంచి విత్తనాలు కొనుగోలు చేయాలి. పత్తిలో సూటి, సుంకర రకాలున్నాయి. చాలా మంది బీటీ పత్తినే సాగు చేస్తున్నారు. మైకో, నూజివీడు, కావేరి, బ్రహ్మ, బోల్గార్డ్, అజీత్, ఇలా చాలా కంపెనీల విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. రైతులు ఎవరికి నచ్చిన విత్తనాలు వాల్లు విత్తుకోవాలి. పంటకాలం పూర్తయ్యే వరకు రసీదులు భద్రపరుచుకోవాలి.
ఎరువులు వేయడం
ఎకరాకు 60 నుంచి 80 కిలోల నత్రజని, 25 నుంచి 35 కిలోల భాస్వరం, 25 నుంచి 35 కిలోల పొటాష్ వేసుకోవాలి. భాస్వరం, పొటాష్లను మూడు సమభాగాలుగా చేసుకొని విత్తిన 30 రోజులకు , 60 రోజులకు, 90 రోజులకు వేసుకోవాలి. భూసార పరీక్షలు చేయించుకుని తదనుగుణంగా సిపారస్సు చేసిన ఎరువులు వాడితే పోషకాలు సమపాళ్లలో అందడంతో ఖర్చు తగ్గుతుంది.
విత్తన నమోదు
ఎకరానికి 650 గ్రాముల విత్తనాలు సరిపోతాయి. నేలసారాన్ని బట్టే విత్తే దూరం ఎంచుకోవాలి. బలమైన నల్లరేగడి నేలల్లో 90 ప్లస్ 90 సెంటీ మీటర్లు, మధ్యస్థ నేలల్లో వరుసల మధ్య దూరం 90 సెంటీ మీటర్లు, మొక్కల మధ్య దూరం 90 సెంటీ మీటర్లు ఉండేట్లు విత్తుకోవాలి. బీటీ పత్తి చుట్టూ రెండు నుంచి నాలుగు వరుసలు నాన్బీటీ పత్తిని ఖచ్చితంగా విత్తుకోవాలి.
విత్తన రకం, నేల స్వభావమే ప్రధానం
భూసార పరీక్షల ఫలితాల ఆధారంగానే ఎరువులు వాడాలి
మండల వ్యవసాయాధికారి జ్యోతి

పత్తి సాగుకు సమయమిదే..