బీమా.. అతివలకు ధీమా | - | Sakshi
Sakshi News home page

బీమా.. అతివలకు ధీమా

Jun 29 2025 3:02 AM | Updated on Jun 29 2025 3:02 AM

బీమా.. అతివలకు ధీమా

బీమా.. అతివలకు ధీమా

● ప్రీమియం చెల్లిస్తున్న ప్రభుత్వం ● రుణ, ప్రమాదబీమా అమలు ● బాధిత కుటుంబాలకు పరిహారం ● 10,014 సంఘాలు.. 1,15,171 మంది సభ్యులు

గంభీరావుపేట(సిరిసిల్ల): మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడంతోపాటు ఆపద వస్తే ఆదుకునేలా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. గ్రామీణ మహిళలు వ్యాపారాల ద్వారా ఆర్థికంగా స్థిరత్వం పొందేందుకు రుణాలు మంజూరు చేస్తుంది. ఈక్రమంలోనే స్వయం సహాయక సంఘాల మహిళలకు ప్రభుత్వం అండగా నిలిచేందుకు రుణ, ప్రమాదబీమా పథకాలకు శ్రీకారం చుట్టింది. ప్రమాదంలో మృతిచెందిన స్వయం సహాయక సంఘ మహిళల కుటుంబాలకు రూ.10 లక్షల వరకు పరిహారం అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది. రుణం పొందిన మహిళ సహజంగా మృతిచెందితే ఆమె కుటుంబానికి రుణబీమాను వర్తింపజేసి అండగా నిలువనుంది. ప్రమాదబీమాను 2024 మార్చి 14 నుంచి వర్తింపజేయనుంది. జిల్లాలో 10,014 స్వయం సహాయక సంఘాల్లో 1,15,171 మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు.

బీమా.. భవిష్యత్‌కు రక్షణ కవచం

● జిల్లాలో ఇప్పటి వరకు 8 మంది మహిళలు ప్రమాదవశాత్తు మృతిచెందినట్లు అధికారులు గుర్తించారు. వారికి ప్రమాదబీమా పథకం కింద పరిహారం అందించనున్నారు.

● సహజ మరణం పొందిన మహిళల కోసం అమలు చేస్తున్న రుణబీమా పథకం కోసం 157 మందిని గుర్తించారు. వీరిలో 80 మందికి బీమాపథకం సొమ్ము రూ.70,43,675 చెల్లించినట్లు అధికారులు చెబుతున్నారు. మృతిచెందిన సభ్యురాలు సీ్త్రనిధి, బ్యాంక్‌ లింకేజీ రుణాలు తీసుకొని చెల్లించకపోయి ఉంటే ప్రభుత్వం ప్రకటించిన రూ.10 లక్షల్లో రుణ బకాయిలు మినహాయించుకొని మిగతా డబ్బులు బాధిత కుటుంబాలకు అందజేస్తారు.

● సహజ మరణం పొందిన సభ్యులకు మాత్రం రూ.2లక్షల్లోపు రుణబకాయిలు ఉంటే ప్రభుత్వమే చెల్లించి వారి రుణఖాతాలను మూసివేయనుంది.

● ప్రమాదంలో 50 శాతం వైకల్యం పొందితే రూ.5లక్షలు చెల్లిస్తారు. మృతిచెందిన మహిళకు పొదపు అప్పు ఉంటే అది కూడా పూర్తిగా మాఫీ చేస్తారు. ఇందుకోసం గాయాలపాలైన మహిళ అంగవైకల్యం తెలుపుతూ సదరం సర్టిఫికెట్‌, చికిత్స పొందిన ఆసుపత్రి పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది.

● బీమాసౌకర్యం 18 నుంచి 60 ఏళ్ల వయస్సు ఉన్న సభ్యులకు మాత్రమే వర్తించనుంది.

ప్రీమియం చెల్లించకుండానే బీమా

మహిళా స్వయం సహాయక సంఘాల్లోని సభ్యులు గతంలో కొంతమేర ప్రీమియం చెల్లిస్తే మిగతాది ప్రభుత్వం జమచేసేది. ప్రస్తుతం మహిళా సంఘాలకు ప్రభుత్వమే నేరుగా ఆర్థికసాయం అందించాలని నిర్ణయించింది. ఎలాంటి ప్రీమియం చెల్లించకుండానే రుణ, ప్రమాదబీమాలను అమలు చేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement