
పరిశ్రమల స్థాపనకు వేగంగా అనుమతులు
● సబ్సిడీ ట్రాక్టర్లతో ఇసుక రవాణాను నిరోధించాలి ● కలెక్టర్ సందీప్కుమార్ ఝా
సిరిసిల్ల: జిల్లాలో పరిశ్రమల స్థాపనకు వేగంగా అనుమతులు ఇవ్వాలని, యువతకు ఉపాధి కల్పించేందుకు టీజీ ఐ–పాస్ కింద వచ్చిన దరఖాస్తులను నిర్ధేశిత సమయంలో అనుమతులు జారీ చేయాలని కలెక్టర్ సందీప్కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో శనివారం జిల్లా పరిశ్రమల ప్రోత్సాహక కమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ సందీప్కుమార్ ఝా మాట్లాడుతూ, జిల్లాలో టీజీ ఐ–పాస్ విధానం అమలవుతున్న తీరును ఆరా తీశారు. నూతన పరిశ్రమల స్థాపనకు వచ్చిన 27 ప్రతిపాదనలలో 21 ప్రతిపాదనలకు వివిధ శాఖలు జారీచేసిన అనుమతులను కలెక్టర్ సమీక్షించారు. పెండింగ్లో ఉన్న 6 ప్రతిపాదనలు సైతం తక్షణమే సమీక్షించి అనుమతులు జారీ చేసి, ఆన్లైన్లో ఉంచాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో టీ– ప్రైడ్ పథకం కింద మంజూరు చేసిన 42 యూనిట్లు ఫైల్స్ పూర్తిస్థాయి వివరాలను అందించాలన్నారు. టీఫ్రైడ్లో అందించిన ట్రాక్టర్లను ఇసుక రవాణాకు వినియోగించకుండా చూడాలన్నారు. పరిశ్రమల శాఖ జిల్లా మేనేజర్ టి.హన్మంతరావు, టీజీఐఐసీ జోనల్ మేనేజర్ మహేశ్వర్, జిల్లా రవాణా శాఖ లక్ష్మణ్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ డి.స్వప్న, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ నాజర్ అహ్మద్, ఫైర్ ఆఫీసర్ నరేందర్, తదితరులు పాల్గొన్నారు.
సమస్యల పరిష్కారానికే భూ భారతి
తంగళ్లపల్లి(సిరిసిల్ల): భూ సమస్యలు పరిష్కారమే లక్ష్యంగా ప్రభుత్వం నూతన ఆర్ఓఆర్ భూ భారతి చట్టం చేసిందని కలెక్టర్ సందీప్కుమార్ ఝా పేర్కొన్నారు. తంగళ్లపల్లిలో భూభారతి చట్టంపై శనివారం అవగాహన కల్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ భూభారతి చట్టం 2025 అమల్లోకి వచ్చిందని రాష్ట్రంలో మొదటగా 4 మండలాల్లో పైలట్ ప్రాజెక్ట్ కింద ఈ చట్టం అమలు చేస్తుందని తెలిపారు. ముప్పై రోజుల్లోగా మ్యుటేషన్ పూర్తవుతుందన్నారు. లైసెన్స్ సర్వేయర్ల ద్వారా భూమి మ్యాప్ తయారు చేస్తేనే రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ జరుగుతుందన్నారు. ప్రస్తుతం ధరణిలో ఉన్న భూ రికార్డులు భూ భారతిలో కొనసాగుతాయని స్పష్టం చేశారు. భూ హక్కుల రికార్డుల్లో తప్పుల సవరణకు నూతన చట్టం అమల్లోకి వచ్చిన ఏడాదిలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. జిల్లా గ్రంథాలయసంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ వెలుముల స్వరూప, ఆర్డీవో రాధాబాయి, వ్యవసాయ మార్కెట్ కమిటి చైర్మన్ నేరెళ్ల నర్సింగం, తహసీల్దార్ జయంత్కుమార్ పాల్గొన్నారు.