టీడీపీవి చిల్లర రాజకీయాలు
అరాచక సంస్కృతికి తెరతీస్తున్నారు కార్యకర్తలకు అండగా ఉంటాం వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్రెడ్డి
గిద్దలూరు రూరల్: టీడీపీ నాయకులు చిల్లర రాజకీయాలు చేస్తూ అక్రమ కేసులతో అణచివేయాలని చూస్తున్నారని, అటువంటి అప్రజాస్వామిక చర్యలను చూస్తూ సహించమని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్రెడ్డి అన్నారు. కంభం మాజీ ఏఎంసీ చైర్మన్ నెమిలిదిన్నె చెన్నారెడ్డి పై అక్రమ కేసులు బనాయించి గిద్దలూరు సబ్ జైలులో ఉంచిన నేపథ్యంలో ఆయనను పరామర్శించేందుకు మంగళవారం పట్టణంలోని సబ్జైలుకు వచ్చిన సందర్భంగా బూచేపల్లి విలేకరులతో మాట్లాడారు. వైఎస్సార్ సీపీలో ఉత్సాహంగా పనిచేస్తూ ప్రజల్లో అభిమానం కలిగి ఉన్న సీనియర్ నాయకుడు చెన్నారెడ్డి పై అక్రమంగా కేసులు పెట్టి జైలులో ఉంచడం దారుణం అన్నారు. గిద్దలూరు నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ నాయకుల పై అక్రమ కేసులు ఎక్కువగా పెడుతున్నారన్నారు. గిద్దలూరు మండలం దొడ్డంపల్లె గ్రామానికి చెందిన బొర్రా క్రిష్ణారెడ్డిని గతంలో అక్రమంగా అరెస్ట్ చేసి 65 రోజుల పాటు జైలులో ఉంచారని, తరువాత ఇప్పుడు ఏ తప్పూ చేయని చెన్నారెడ్డి పై అక్రమ కేసులు బనాయించి జైలులో పెట్టడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టుగా భావిస్తున్నామన్నారు. కంభం కందులాపురం సెంటర్లో వైఎస్సార్ విగ్రహానికి టీడీపీ నాయకులు వారి నాయకుల ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకున్నారని, ఆ విషయాన్ని చెన్నారెడ్డి అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఫ్లెక్సీలు తొలగించాలని కోరారన్నారు. అదే చెన్నారెడ్డి చేసిన తప్పయిందని.. లేనిపోని అక్రమ కేసులు బనాయించి జైలులో ఉంచడం ఎంత వరకు సమంజసం అని అన్నారు.
ఇది కక్షపూరిత పాలన..
అధికారం ఎప్పుడూ మీదే ఉండదని టీడీపీ నాయకులు గ్రహించుకోవాలని తాటిపర్తి అన్నారు. అక్రమ కేసులతో వైఎస్సార్ సీపీ నాయకులను ఇబ్బందులకు గురిచేయడం ప్రజలు గమనిస్తుంటారన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కక్ష పూరిత పరిపాలన కొనసాగిస్తూ అరాచక సంస్కృతిని లేవనెత్తుతున్నారని విమర్శించారు. అక్రమ కేసులకు వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలెవరూ భయపడరని వారు గుర్తుపెట్టుకోవాలన్నారు. అక్రమ కేసుల్లో ఇబ్బందులు పడే నాయకులకు, కార్యకర్తలకు వైఎస్సార్ సీపీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. పోలీసు శాఖ వారు శాంతి భద్రతలకు విఘాతం కల్పించేలా ప్రవర్తించడం మంచి పద్ధతి కాదన్నారు. అక్రమ కేసులకు వారు సహకరించకుండా ఉండాలని కోరారు. జగనన్న ప్రభుత్వంలో పేదప్రజలకు ఎటువంటి లోటులేకుండా సుపరిపాలన కొనసాగిందన్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో అటువంటి పాలన కరువైందన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి, కంభం మాజీ ఎమ్మెల్యే ఉడుముల శ్రీనివాసరెడ్డి, మాజీ ఎంపీపీ కడప వంశీధరరెడ్డి, వైఎస్సార్ సీపీ మున్సిపల్ కన్వీనర్ మానం బాలిరెడ్డి, మండల కన్వీనర్ బి.ఓబులరావు, వైఎస్సార్ సీపీ నాయకులు బొర్రా క్రిష్ణారెడ్డి, సూరా స్వామిరంగారెడ్డి, పాలుగుళ్ల నరసింహారెడ్డి, శ్రీకాంత్రెడ్డి, ఎదురు శ్రీనివాసరెడ్డి, సీఆర్ఐ మురళి, కొమరోలు జెడ్పీటీసీ వెంకటనాయుడు, అర్ధవీడు ఎంపీపీ వెంకటరావు, మాజీ ఎంపీపీ రవికుమార్యాదవ్, తదితరులు పాల్గొన్నారు.


