ఒంగోలు టౌన్: మార్క్సిజం, లెనినిజం వెలుగులో అనేక ఉద్యమాలకు నాయకత్వం వహించిన రాధక్క విప్లవ స్ఫూర్తిని కొనసాగించాలని ఓపీడీఆర్ రాష్ట్ర అధ్యక్షుడు చావలి సుధాకర్ పిలుపునిచ్చారు. మంగళవారం మృతి చెందిన సీపీఐ ఎంఎల్ ప్రతిఘటన ఉద్యమ నాయకురాలు అక్కినేని నిర్మల అలియాస్ రాధక్క సంతాప సభ బుధవారం నగరంలోని ‘మంచి పుస్తకం’ వద్ద నిర్వహించారు. ఈ సందర్భంగా రాధక్క చిత్రపటానికి పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు. రెండు నిమిషాలపాటు మౌనం వహించారు. అనంతరం సుధాకర్ మాట్లాడుతూ నిబద్ధత కలిగిన నాయకురాలిగా అనతికాలంలోనే కేంద్ర నాయకత్వానికి ఎదగారని చెప్పారు. రాధక్క కాకినాడలో పాలిటెక్నిక్ చదువుకున్నారని సీపీఐ రెడ్ స్టార్ జిల్లా కార్యదర్శి భీమవరపు సుబ్బారావు తెలిపారు. పీడిత తాడిత ప్రజలకు ఆమె అండగా నిలిచారని అన్నారు. కార్యక్రమంలో అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి కొంగర నరసింహ, కార్మిక నాయకులు సామేలు, సమతా దళ్ ఫోర్స్ నాయకులు పాలడుగు రమేష్, ఓపీడీఆర్ జిల్లా అధ్యక్షులు గాలి సంగీతరావు, విశ్రాంత సబ్ కలెక్టర్ పి.పేరయ్య, ఆవుల సుబ్రహ్మణ్యం, నాయి బ్రాహ్మణ సంఘం నాయకులు ధరణి కోట లక్ష్మీ నారాయణ తదితరులు పాల్గొన్నారు. అరుణోదయ కళాకారులు విప్లవ గేయాలను ఆలపించారు.
Comments
Please login to add a commentAdd a comment