
తూప్రాన్: కాంగ్రెస్ నాయకుల మాయమాటలు నమ్మితే మన భవిష్యత్ ఆగమైతదని ఆర్థిక శాఖ మంత్రి టి.హరీశ్రావు అన్నారు. బుధవారం ఆయన మెదక్ జిల్లా తూప్రాన్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ, ఎన్నికలు దగ్గరపడే కొద్దీ కాంగ్రెస్ నాయకులు ఆపద మొక్కులు మొక్కుతూ, ఆచరణ సాధ్యంకాని హామీలు ఇస్తున్నారని మండిపడ్డారు. అలాంటి దొంగ కాంగ్రెస్ వాళ్లు కావాలా..? ప్రజల కష్టాలు తీర్చే కేసీఆర్ కావాలా.. ప్రజలు ఆలోచించుకోవాలని కోరారు.
50 ఏళ్ల పాటు కాంగ్రెస్ వాళ్లతో ఏగాం.. వీళ్ల సంగతి మనకు తెలియదా అని అన్నారు. ‘కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ ఎప్పుడైనా గజ్వేల్కు వచ్చాడా.. ఏం అభివృద్ధి జరిగిందో నీ మొఖానికి ఏమి తెలుసు’అని ఎద్దేవా చేశారు. ఆయన మంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్ నుంచి కామారెడ్డికి వెళ్లే సమయంలో ఒక్కసారైనా తూప్రాన్లో ఆగి ప్రజల ఇబ్బందులను తెలుసుకున్న పాపాన పోలేదని విమర్శించారు.
‘రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి మీ కళ్లకు కనిపించడంలేదా.. లేకుంటే కంటి వెలుగులో చూపించుకోండి’అని కాంగ్రెస్ నేతలకు సలహా ఇచ్చారు. రైతుబంధు, రైతుబీమా, ఇంటింటికీ తాగునీరు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లాంటి అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్న సీఎం కేసీఆర్ను విమర్శించడమే కాంగ్రెస్ నాయకులు పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకులు ఎన్ని గిమ్మిక్కులు చేసినా కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
త్వరలో శుభవార్త వింటారు
తెలంగాణ ప్రజలు త్వరలో శుభవార్త వింటారని మంత్రి హరీశ్రావు అన్నారు. తమ పార్టీ మేనిఫెస్టో అన్ని వర్గాలను ఆకట్టుకునే విధంగా ఉంటుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ పనిలోనే నిమగ్నమయ్యారని, సీఎంనోటి నుంచే తీపి కబురు వింటారని చెప్పారు. అన్ని వర్గాల సంక్షేమం కోసం పనిచేస్తున్న సీఎం కేసీఆర్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.