సాక్షి,చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. పార్టీకి చెందిన కొంతమంది ఎమ్మెల్యేలు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం ప్రభుత్వానికి ఫ్లోర్ టెస్ట్లో మద్దతు ఇవ్వడంతో, ఏఐఏడీఎంకే కఠిన చర్యలకు ఉపక్రమించింది. టీవీకేకు మద్దతు తెలిపిన ఎమ్మెల్యేలతో పాటు సిట్టింగ్ ఎమ్మెల్యేలను కూడా పార్టీ పదవుల నుంచి తొలగించింది.
జిల్లా కార్యదర్శి పదవులతో సహా వివిధ బాధ్యతలలో ఉన్న 13 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటు మొత్తం 29 మంది ఏఐఏడీఎంకే నాయకులను పదవుల నుంచి తొలగించారు. ఈ జాబితాలో సీనియర్ నేతలు సి.వి. షణ్ముగం, ఎస్.పీ. వేలుమణి, ఆర్. కామరాజ్, సి. విజయభాస్కర్, తంగమణి, కేపీ అన్బళగన్, కేసీ వీరమణి, ఎంఆర్. విజయభాస్కర్ వంటి పలువురు కీలక నాయకులు ఉన్నారు.
ఈ చర్యతో ఏఐఏడీఎంకేలో అంతర్గత విభేదాలు మరింతగా బహిర్గతమయ్యాయి. పార్టీ అధినేత ఎడప్పాడి పళని స్వామి ఎమ్మెల్యేలను నియంత్రించేందుకు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు, విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం ఫ్లోర్ టెస్ట్లో మెజారిటీని నిరూపించుకోవడం ద్వారా తన స్థిరత్వాన్ని బలపరచుకుంది.


