
సమ్మెలోకి మున్సిపల్ ఇంజినీరింగ్ సిబ్బంది
బొబ్బిలి: తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఆదివారం అర్ధరాత్రి నుంచి సమ్మెలోకి వెళ్తున్నామని ఇంజనీరింగ్ సిబ్బంది స్పష్టంచేశారు. ఈ మేరకు శనివారం బొబ్బిలి కమిషనర్ ఎల్.రామలక్ష్మి, చైర్మన్ రాంబార్కి శరత్లకు సమ్మె నోటీసు అందజేశారు. గత కొన్ని నెలలుగా సిబ్బంది సమ్మెలో ఉన్నప్పటికీ బొబ్బిలిలో మాత్రం ప్రజాప్రయోజనార్థం విధులు నిర్వహిస్తున్నామన్నారు. అయినా ప్రభుత్వం, అధికారుల్లో ఏమాత్రం కదలిక లేకపోవడంతో తాము కూడా సమ్మెలోకి వెళ్తున్నట్టు చెప్పారు. మరో మూడు రోజుల వరకూ వాటర్ సప్లై కార్మికులు విధుల్లోనే ఉంటారని, అనంతరం వారు కూడా సమ్మెలో మాతో కలిసి పాల్గొంటారని తెలిపారు. సమ్మెను కొనసాగించకుండా ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించాలన్నారు. లేకుంటే ప్రజల ఇబ్బందులకు మీరే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.