
స్కానింగ్ వివరాలపై ప్రతీ నివేదిక అందజేయాలి
విజయనగరం ఫోర్ట్: స్కానింగ్ కేంద్రాల్లో ప్రతి రోజూ ఎన్ని స్కానింగ్లు జరుగుతున్నాయనే అంశంపై ప్రతీ రోజు నివేదిక అందజేయాలని జిల్లా కలెక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని ఆయన చాంబర్లో శనివారం లింగ నిర్ధారణ నిరోధక చట్టం అమలుపై జిల్లా స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో రోజు వారీగా జరుగుతున్న ప్రసవాలను నమెదు చేసి ఆయా ఆసుపత్రుల నుంచి ప్రతి రోజు సమాచారం సేకరించే వ్యవస్థను ఏర్పాటు చేయాలన్నారు. జిల్లాలోని ప్రైవేటు ఆసుపత్రుల్లో జరిగిన గర్భస్రావాల సమాచారం కూడా వెంటనే అందజేయాలన్నారు. ఏప్రిల్ నెలకు సంబంధించి జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో జరిగే ప్రసవాల సమాచారాన్ని వెంటనే ఒక నివేదిక రూపంలో అందజేయాలన్నారు. అన్ని స్కానింగ్ కేంద్రాల్లోనూ లింగ నిర్ధారణ సమాచారం తెలియజేయడం జరగదనే బోర్డులు సందర్శకులకు స్పష్టంగా కనిపించేలా ఏర్పాటు చేయాలన్నారు. స్కానింగ్ కేంద్రాల్లో నిర్వహించే పరీక్షలకు ఆయా ఆసుపత్రులు వసూలు చేసే చార్జీల వివరాలతో కూడిన ధరల పట్టికను కూడా బోర్డుల రూపంలో ప్రదర్శించే ఏర్పాట్లు చేయాలన్నారు. స్కానింగ్ కేంద్రాలపై వైద్య ఆరోగ్య శాఖ పూర్తి స్థాయిలో నియంత్రణ ఉండాలని స్పష్టం చేశారు. కొత్తగా స్కానింగ్ కేంద్రాల ఏర్పాటుకు సంబంధించి ఆయా రెవెన్యూ డివిజనల్ అధికారులు తనిఖీ చేసిన నివేదిక ఇచ్చిన తర్వాతే వాటికి అనుమతులు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. సమావేశంలో డీఎంహెచ్వో డాక్టర్ ఎస్.జీవనరాణి, డీఎల్వో డాక్టర్ కె.రాణి, డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ సూర్యనారాయణ, ఆర్బీఎస్కే పీవో డాక్టర్ సుబ్రమణ్యం, డీఐవో డాక్టర్ ఆర్, అచ్చుతకుమారి, డీపీహెచ్ఎన్వో సత్యవతి, డెమో చిన్నతల్లి తదితరులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ బీఆర్ అంబేడ్కర్