
పాలిసెట్కు 6,938 మంది హాజరు
విజయనగరం అర్బన్: జిల్లా వ్యాప్తంగా బుధవారం జరిగిన పాలిసెట్–2025 ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని బొబ్బిలి, గజపతినగరం, విజయనగరం ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన 23 కేంద్రాల్లో పరీక్ష రాయాల్సిన 8,134 మందిలో 85.3 శాతంతో 6,938 మంది హాజరయ్యారు. బాలురు 88.53తో 4,083 మంది, బాలికలు 81.06 శాతంతో 2,855 మంది పరీక్ష రాశారు. పట్టణంలోని ఎంఆర్ఏజీఆర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో మూడు పరీక్ష కేంద్రాలను కేటాయించడంతో విద్యార్థులు గందరగోళానికి గురయ్యారు. పరీక్షా సమయం వరకు ఒక కేంద్రం వద్ద ఉండిపోయి చివరి నిముషంలో అక్కడ కాదని తెలిసి పరుగులు తీశారు. ఈ క్రమంలో సమయం మించిపోవడంతో పలువురు విద్యార్థులు పరీక్షకు దూరమయ్యారు. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. పరీక్ష కేంద్రం నిర్వాహకులను నిలదీశారు. ఇదే విషయంపై పరీక్షల జిల్లా కన్వీనర్, ఎంఆర్ఏజీఆర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ జె.ఆశారమణి స్పందిస్తూ మూడు పరీక్ష కేంద్రాల్లోనే కాకుండా, నెల్లిమర్ల పరీక్ష కేంద్రాల విద్యార్థులు కూడా పలువురు గందరగోళానికి గురయ్యారన్నారు. సమయానికి పరీక్ష కేంద్రానికి వచ్చిన వారిని అనుమతించామన్నారు. నిర్దేశిత సమయం దాటి వచ్చిన వారికి మాత్రమే నిబంధనల మేరకు పరీక్షకు అనుమతి ఇవ్వలేదని వివరించారు.