దళితులపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

దళితులపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి

Apr 5 2026 8:30 AM | Updated on Apr 5 2026 8:30 AM

దళితులపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి రైలు కింద పడి వృద్ధుడు ఆత్మహత్య మెలకువగా ఉండగానే వృద్ధుడికి బైపాస్‌ సర్జరీ ఎస్సీ, ఎస్టీ చట్టానికి తూట్లు పొడవటం సరికాదు ● దళిత హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు నీలం నాగేంద్రరావు

వైఎస్సార్‌ సీపీ ఎస్సీ విభాగం

రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రకాష్‌

తాడేపల్లిరూరల్‌: ఇటీవల దళితులపై దాడిచేసిన స్పీకర్‌ అయ్యన్నపాత్రుడుపై వెంటనే చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌ సీపీ ఎస్సీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముదిగొండ ప్రకాష్‌ శనివారం ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. మార్చి 18వ తేదీ కొత్త అమావాస్య రోజు నర్సీపట్నం నూకాంబిక జాతరలో డప్పు కొట్టే నాగులాపల్లి రాందాస్‌ అనే దళితుడిపై అయ్యన్న పాత్రుడు దాడి చేయడం తగదని అన్నారు. నర్సీపట్నం ఎస్సీ కాలనీ మూడో వార్డుకు చెందిన టీడీపీ సానుభూతి పరుడు రాందాస్‌ను తిట్టినా, కొట్టినా చెల్లుతుందని అయ్యన్నపాత్రుడు దళితులపై రెచ్చిపోతున్నారని విమర్శించారు. మార్చి 31, ఏప్రిల్‌ 1న నర్సీపట్నంలో మరిడిమాంబ జాతర తానే స్వయంగా జరిపి పదిమంది డప్పు కళాకారులు కావాలని రిక్షా కార్మికుడు, డప్పు కళాకారుడు అయిన భాస్కరరావును మాదిగ సామాజికవర్గ వ్యక్తితో ఒప్పందం చేసుకుని వాళ్లలో ఎనిమిది మందే వచ్చారని వారిపై అయ్యన్నపాత్రుడు ఆగ్రహించిన బూతులు తిట్టి అవమానించారని పేర్కొన్నారు. ప్రభుత్వంలో బాధ్యత గల రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌ రాజ్యాంగపరమైన పదవుల్లో ఉండి ఈ దాడులు చేయడం సిగ్గుచేటని, వెంటనే దళితులపై దాడిచేసిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు.

తెనాలిరూరల్‌: రైలు కింద పడి వృద్ధుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చుండూరు సమీపంలో శనివారం జరిగింది. బాపట్ల జిల్లా అమృతలూరుకు చెందిన కొల్లూరి వీరరాఘవులు(70) చుండూరు స్టేషన్‌ సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న జీఆర్పీ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని వైద్యశాలకు తరలించారు. ఎస్‌ఐ ఎల్‌.సరస్వతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గలకారణాలను దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.

గుంటూరు మెడికల్‌: రోగి మెలుకువగా ఉండగానే గుండె బైపాస్‌ సర్జరీ చేసి అతడి ప్రాణాలు కాపాడినట్లు ఆస్టర్‌ రమేష్‌ హాస్పిటల్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌, చీఫ్‌ కార్డియాలజిస్ట్‌ డాక్టర్‌ పోతినేని రమేష్‌బాబు చెప్పారు. ఆపరేషన్‌ వివరాలను ఆయన శనివారం గుంటూరులో మీడియాకు వెల్లడించారు. ప్రకాశం జిల్లా అద్దంకికి చెందిన జయరావు(64)కు 2018లో కేన్సర్‌ సోకి ఊపిరితిత్తుల సంబంధిత సమస్య ఏర్పడటంతో ఒక ఊపిరితిత్తిని తొలగించారు. ఇటీవల చాతిలో తీవ్రమైన నొప్పి వచ్చి, తమ వద్దకు రాగా..యాంజియోగ్రామ్‌ చేసి, 3 రక్తనాళాలు పూడినట్లు నిర్థారించామన్నారు. రోగికి గుండె బైపాస్‌ సర్జరీ చేయాలని నిర్ణయించి, ఊపిరితిత్తుల సమస్య ఉండి, ఒక లంగ్‌ తీసివేయడంతో, రోగి మెలుకువగా ఉండగానే బైపాస్‌ సర్జరీ చేయాలని నిర్ణయించామన్నారు. రెండు రోజుల క్రితం కరోనరి ఆర్టరీ బైపాస్‌ గ్రాఫ్టింగ్‌ను విజయవంతంగా చేసినట్లు తెలిపారు. జయరావుకు మధుమేహం, బీపీ కూడా ఉన్నాయని, అత్యంత క్లిష్టమైన అనారోగ్య సమస్యలతో ఉన్న రోగికి తాము విజయవంతంగా బైపాస్‌ సర్జరీ చేశామని చెప్పారు. కార్యక్రమంలో హాస్పిటల్‌ డిప్యూటీ ఎండీ డాక్టర్‌ రాయపాటి మమత, ఆపరేషన్‌లో పాల్గొన్న గుండె శస్త్రచికిత్స నిపుణుడు డాక్టర్‌ జయరామ్‌పాయ్‌, సీనియర్‌ మత్తు వైద్య నిపుణుడు డాక్టర్‌ లోకనాథన్‌, వైద్యులు శివప్రసాద్‌, మృత్యుంజయ్‌, అశోక్‌కుమార్‌, భరత్‌ సిద్ధార్థ, శ్రీకాంత్‌ మహాపాత్ర, క్లస్టర్‌ బిజినెస్‌ హెడ్‌ డాక్టర్‌ కార్తీక్‌ చౌదరి తదితరులు పాల్గొన్నారు.

బాపట్లటౌన్‌: ఏన్నో ఏళ్లుగా పోరాటాలు చేసి సాధించుకున్న ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టానికి కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వాలు తూట్లు పొడవటం సరికాదని దళిత హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షులు నీలం నాగేంద్రరావు అన్నారు. దళిత హక్కుల సాధన కోసం శనివారం జిల్లా కలెక్టర్‌ కార్యాలయం ముందు దళిత సంఘాల నాయకులతో కలిసి ఆందోళన చేశారు. నీలం నాగేంద్రరావు మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ కేసులో హైకోర్టు కూడా యాంటీ స్పెటర్‌ బెయిల్‌ ఇవ్వకూడదని చట్టం చెబితే అగ్రకుల అరాచక శక్తులను రక్షించడానికి మోడీ, చంద్రబాబు ప్రభుత్వాలు ఏడు సంవత్సరాల శిక్ష పడే వీలున్న ఎస్సీ ఎస్టీ కేసుల్లో స్టేషన్‌ బెయిల్‌ ఇచ్చి పంపుతుందన్నారు. ఆందోళన చేసిన వారిలో మాల మహానాడు అధ్యక్ష కార్యదర్శులు దారా అంజయ్య, కాకుమాను రవి, వివిధ సంఘాల నాయకులు పట్రా బంగారం, మేడికొండ మురళి, బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు గుద్దే రాజారావు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement