
అందరి సహకారంతో సత్రం అభివృద్ధి
నరసరావుపేట రూరల్: దాతలు, సభ్యుల సహకారంతోనే కోటప్పకొండ రెడ్ల సత్రం అభివృద్ధి సాధించిందని ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. కోటప్పకొండలోని యోగి వేమారెడ్డి చారిటబుల్ ట్రస్ట్, రెడ్ల సత్రం సిల్వర్ జూబ్లీ వేడుకలు ఆదివారం సత్రంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యేలు డాక్టర్ గోపిరెడ్డి, యర్రం వెంకటేశ్వరరెడ్డిలు హాజరయ్యారు. సత్రంలో నూతనంగా నిర్మించనున్న భోజనశాల, గదుల నిర్మాణ పనులకు అతిథులు శంకుస్థాపన చేశారు. అనంతరం 2001లో సత్రం నిర్మాణ పనులను ప్రారంభించినప్పుడు సభ్యులుగా ఉన్న 49 మందిని, సత్రంలో గదుల నిర్మాణానికి సహకరించిన 98మంది దాతలను సన్మానించారు. భోజనశాల, గదుల నిర్మాణానికి విరాళాలు ప్రకటించిన దాతలను అతిథులు సన్మానించారు. ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి మాట్లాడుతూ సత్రం సిల్వర్ జూబ్లీ వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. సత్రం అభివృద్ధికి కృషిచేసిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు. సంఘీయులు అందరి సహకారంతో సత్రంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. సత్రం కమిటీలు విరాళాలు సేకరణకు విశేష కృషి చేశాయని కొనియాడారు. మాజీ ఎమ్మెల్యే యర్రం మాట్లాడుతూ పవిత్ర పుణ్యక్షేత్రం కోటప్పకొండలో స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తులకు సత్రం విశేష సేవలు అందిస్తుందని తెలిపారు. కులాలకతీతంగా వృద్దాశ్రమం నిర్వహించడం హర్షణీయమన్నారు. కార్యక్రమంలో సత్ర కమిటీ గౌరవ అధ్యక్షుడు భవనం రాఘవరెడ్డి, అధ్యక్షుడు కంజుల వీరారెడ్డి, ప్రధాన కార్యదర్శి పొలిమేర వెంకటరెడ్డి, కోశాధికారి మాగులూరి సుబ్బారెడ్డి, ఉపాధ్యక్షుడు గంటా నరసింహారెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీ వెన్నపూస జోసఫ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్యేలు డాక్టర్ గోపిరెడ్డి, యర్రం కోటప్పకొండలో రెడ్ల సత్రంసిల్వర్ జూబ్లీ వేడుకలు దాతలకు ఘన సన్మానం