
జేఎన్టీయూఎన్లో కాంట్రాక్ట్ అధ్యాపకుల ఆందోళన
నరసరావుపేట రూరల్: నరసరావుపేటలోని కాకాని జేఎన్టీయూఎన్ ఇంజనీరింగ్ కళాశాలలో కాంట్రాక్ట్ అధ్యాపకులు ఆందోళనకు దిగారు. జేఎన్టీయూకే కాంట్రాక్ట్ అధ్యాపకుల రెన్యూవల్ విషయంలో అనుసరిస్తున్న విధానానికి నిరసనగా మంగళవారం కళాశాలలోని ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సిహెచ్ శ్రీనివాసరావు ఛాంబర్ను ముట్టడించారు. అసిస్టెంట్ ప్రొఫెసర్స్గా గత ఎనిమిది సంవత్సరాలుగా పనిచేస్తున్న తమకు రివ్యూల పేరుతో ఇంటర్వ్యూలు నిర్వహించడంపై ప్రిన్సిపాల్ను ప్రశ్నించారు. అదే విధంగా బ్రేక్ పిరియడ్ను 15 రోజుల నుంచి ఐదు రోజులకు తగ్గించాలని కోరారు. నిబంధనలకు విరుద్దంగా రాష్ట్రంలోని ఇతర యూనివర్సిటీల్లో లేని విదంగా కాంట్రాక్ట్ అద్యాపకులను ఇబ్బందులకు గురిచేసే విధంగా జేఎన్టీయూకే అధికారులు వ్యవహరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కాంట్రాక్ట్ అధ్యాపకుల అసోసియేషన్ అద్యక్షుడు పి.మణికంఠ మాట్లాడుతూ దీనిపై ఇప్పటికే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్, విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ను కలిసి తమ సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లగా వారి నుంచి సానుకూల స్పందన లభించందన్నారు. ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకువచ్చేలా కొంతమంది యూనివర్సిటీ అధికారుల చర్యలు ఉన్నాయని విమర్శించారు. కాంట్రాక్ట్ అధ్యాపకులు హరికృష్ణ, ఆదినారాయణ నాయక్, మన్మదరెడ్డి, సాయి, రాధ, అనిత తదితరులు పాల్గొన్నారు.
రివ్యూల పేరుతో ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్న వర్సిటీ అధికారులు ఎనిమిదేళ్లుగా పనిచేస్తున్న తమకు ఇప్పుడు ఇంటర్వ్యూలు నిర్వహించడంపై అధ్యాపకుల ఆగ్రహం ప్రిన్సిపాల్ చాంబర్ను ముట్టడించిన కాంట్రాక్ట్ అధ్యాపకులు