
మరణ మృదంగం
ఖాకీల వైఫల్యంతో పల్నాడులో
సాక్షి, నరసరావుపేట: పల్నాడులో అత్యంత సమస్యాత్మక గ్రామమైన గుండ్లపాడులో జంట హత్యలు పోలీసుల వైఫల్యంతో జరిగాయనే అభిప్రాయం గ్రామస్తుల నుంచి వ్యక్తమవుతోంది. వెల్దుర్తి మండలం బొదిలవీడు సమీపంలో శనివారం సాయంత్రం 5 గంటల సమయంలో ఇద్దరు టీడీపీ కార్యకర్తలను అదే పార్టీకి చెందిన ప్రత్యర్థులు పాశవికంగా చంపేశారు. వాస్తవానికి గత కొంత కాలంగా గుండ్లపాడులో ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉంది. స్థానిక ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలతో మరోసారి ఆ గ్రామంలోని వర్గాల మధ్య వేడి రాజుకుంది. అప్పటి నుంచి వర్గపోరు నివురుగప్పిన నిప్పులా ఉంది. ఈ విషయాన్ని గుర్తించిన పోలీసులు పికెట్ కొనసాగించినప్పటికీ ఫలితం లేకుండాపోయింది. దీంతో 2022 తోట చంద్రయ్య హత్య తరువాత ఆ గ్రామంలో జంట హత్యలు జరిగాయి. ఈనెల 21న పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు పల్లెనిద్ర పేరిట కార్యకరమం నిర్వహించి ప్రశాతంగా ఉండాలని హెచ్చరించినా ఉపయోగం లేకుండా పోయింది. ప్రస్తుత హత్యలతో ఏర్పడిన వేడి ఎన్ని రోజులు ఉంటుందో.. ఎంత సమస్యాత్మకమవుతోందన్న భయం గ్రామస్తుల్ని వెంటాడుతోంది.
ఫ్లెక్సీల గొడవలో పోలీసుల నిర్తిప్తత
మాచర్ల శాసనసభ్యుడు జూలకంటి బ్రహ్మారెడ్డి పుట్టిన రోజు వేడుకలను పురస్కరించుకుని గత నెలలో టీడీపీ నేత తోట వెంకట్రామయ్య వర్గానికి చెందిన ఉప్పుతోళ్ల శ్రీను అనే కార్యకర్త మృతుడు జవిశెట్టి వెంకటేశ్వర్లు ఉంటున్న బజారులో ఫ్లెక్సీ ఏర్పాటు చేశాడు. తమ బజారులో వేరే వర్గం ఫ్లెక్సీ ఏర్పాటు చేయడంతో జవిశెట్టి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో కాపు కాసి ఉప్పుతోళ్ల శ్రీనుపై పాశవికంగా దాడి చేసి రెండు కాళ్లు విరగొట్టారు. ఆ కక్షతో పక్కా పథకం ప్రకారం జెవిశెట్టి వెంకటేశ్వర్లు, ఆయన తమ్ముడు కోటేశ్వరరావు కాపుకాసి తోట వెంకట్రామయ్య కారుతో గుద్ది పాశవికంగా హత్య చేశారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఇది పూర్తిగా తెలుగుదేశం పార్టీ అంతర్గత విఽభేదాలతో జరిగిన మారణకాండ అని స్పష్టమైంది. అయితే, ఫ్లెక్సీల గొడవ జరిగినప్పుడు కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకొని ఉంటే హత్యా రాజకీయాలకు టీడీపీ కార్యకర్తలు వెళ్లే పరిస్థితి ఉండేది కాదన్న అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది. ఇరువర్గాలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే కావడంతో రాజకీయ ఒత్తిళ్ల నేపథ్యంలో వదిలివేశారు. ఇంత జరుగుతుంటే జిల్లా స్పెషల్ బ్రాంచ్ విభాగం ఏం చేస్తోందన్న ప్రశ్నలు గ్రామస్తుల నుంచి వినిపిస్తున్నాయి. ప్రత్యర్థుల కదలికలు, వారిపై అక్రమ కేసులకు ఎస్బీ వ్యవస్థ నిమగ్నమైందనే అపవాదుంది. దీన్ని ఆసరాగా తీసుకున్న టీడీపీ కార్యకర్తలు డబుల్ మర్డర్లు చేసే వరకు వెళ్లారు.
పోలీసుల నిర్లక్ష్యంతో గుండ్లపాడులో జంట హత్యలు అత్యంత సమస్యాత్మక గ్రామమని తెలిసి జాగ్రత్త పడని పోలీసు శాఖ ఫ్లెక్సీల గొడవలో ఇద్దరు టీడీపీ వారే కావడంతో కఠిన చర్యలు తీసుకోని పోలీసులు అప్పుడే కఠిన చర్యలు తీసుకొని ఉంటే దురాగతాలు జరిగేవి కావంటున్న స్థానికులు గురజాల సబ్ డివిజన్లో డీఎస్పీ నుంచి కానిస్టేబుల్ వరకు ఖాళీలు భర్తీ చేయడంలో ప్రభుత్వ నిర్లక్ష్యమే హత్యలకు కారణం
రెండు నెలలుగా డీఎస్పీ పోస్టు ఖాళీ
రాష్ట్రంలో అత్యంత సమస్యాత్మక పోలీసు సబ్ డివిజన్లలో గురజాల ఒకటి. రెండు నెలలుగా డీఎస్పీ పోస్టు ఖాళీగా ఉంది. అప్పటివరకు డీఎస్పీగా పనిచేస్తున్న జగదీష్ వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు, అక్రమంగా నిర్బంధించి వేధించడానికి పూర్తిగా సహకరించలేదన్న కారణంతో వీఆర్కు పంపారు. దీంతో అప్పటి నుంచి డీఎస్పీ పోస్టు ఖాళీగా ఉంది. ప్రభుత్వం తీవ్ర ఆలస్యం చేయడం కూడా ఈ హత్యలకు దారితీసిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంచార్జిగా సత్తెనపల్లి డీఎస్పీ హనమంతరావు ఉన్నప్పటికి పూర్తిస్థాయిలో డివిజన్పై దృష్టి పెట్టలేకపోయారు. మరోవైపు ఈ సబ్ డివిజన్లో ముఖ్యంగా హత్య జరిగిన వెల్దుర్తి పోలీసుస్టేషన్లో సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తోంది. డీఎస్పీ పోస్టు భర్తీ చేయకపోవడం, సిబ్బంది కొరత విషయంపై ‘సాక్షి’ ఈనెల 16న ఓ కథనం కూడా ప్రచురించింది. దీనిపై ప్రభుత్వం, పోలీసు ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకొని ఉంటే ఈ దారుణం జరిగే అవకాశాలు తగ్గేవని గ్రామస్తులు అభిప్రాయపడుతున్నారు.

మరణ మృదంగం

మరణ మృదంగం