
ఎండీయూ ఆపరేటర్ల ధర్నా
నరసరావుపేట: రాష్ట్రంలో రేషన్ లబ్ధిదారుల ఇళ్ల వద్దకే బియ్యం, ఇతర నిత్యావసరాలను అందిస్తున్న ఎండీయూ వ్యవస్థను భేషరతుగా కొనసాగించాలని ఏపీ రాష్ట్ర సమైఖ్య ఎండీయూ యూనియన్ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లాలోని ఆపరేటర్లు, హెల్పర్లు శుక్రవారం జిల్లా కలెక్టరేట్ వద్ద ఽతమ వాహనాలతో ధర్నా నిర్వహించి డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని జేసీ సూరజ్ గనోరేకు అందజేశారు. తమ సేవలను కొనసాగించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా అధ్యక్షులు సుధాకర్రెడ్డి మాట్లాడుతూ టీడీపీ అధికారంలోకి వస్తే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి తీరా అధికారంలోకి రాగానే 18,500 మందిని, తమతో పాటు మరికొందరిని జాబ్ నుంచి తీసేసే పనిలో ప్రభుత్వం ఉండటం శోచనీయమన్నారు. విజయవాడ వరదల్లో చేసిన సేవలను సీఎం చంద్రబాబు కూడా మెచ్చుకున్నారన్నారు. అటువంటి వ్యవస్థను ఏవిధంగా తీసేస్తారని ప్రశ్నించారు. 2027 వరకు తమకు ప్రభుత్వంతో అగ్రిమెంట్ ఉందన్నారు. దానిని గౌరవించి, దీనిపై అధ్వయనం చేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. నిబద్ధతతో పనిచేస్తున్న ఎండీయూ వ్యవస్థను తొలగించటం చాలా బాధాకరమన్నారు. తమకు న్యాయం చేసేలా ప్రభుత్వం వ్యవహరించాలని కోరారు. ధర్నాలో జిల్లాలోని హెల్పర్లు, ఆపరేటర్లు పాల్గొన్నారు.
వాహనాలను భేషరతుగా కొనసాగించాలని డిమాండ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన ఆపరేటర్లు, హెల్పర్లు