
కూటమి నేతల దౌర్జన్యాలను సహించేది లేదు
వినుకొండ: రాష్ట్రంలో రోజురోజుకీ కూటమి నాయకుల అరాచకాలు పెరిగిపోతున్నాయని మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు విమర్శించారు. ఇటీవల కూటమి నాయకులు చేసిన దాడిలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఈపూరు మండలం కొండ్రముట్ల గ్రామానికి చెందిన రేషన్ డీలర్ మోపూరి నర్సారెడ్డిని, ఆయన కుటుంబసభ్యులను బొల్లా గురువారం పరామర్శించారు. అనంతరం బొల్లా మీడియాతో మాట్లాడుతూ కూటమి నేతల అరాచకాలు చంద్రబాబునాయుడు, లోకేష్ డైరెక్షన్లో పెచ్చుమీరిపోతున్నాయని అన్నారు.
సామాన్య కార్యకర్తలపైన, చిన్నచిన్న నాయకులపై దాడులు చేసి భయబ్రాంతులకు గురి చేస్తున్నారని చెప్పారు. ఒక వైపు పోలీస్ యంత్రాంగం నాయకులు చెప్పినట్లుగానే కేసులు నమోదు చేయడం ఏమిటని ప్రశ్నించారు. నర్సారెడ్డిపై మాస్కులు ధరించి పది మంది దాడి చేసి నడుమును విరిగేటట్లు కొడితే నర్సారెడ్డి నరసయ్యపై దాడి చేసినట్లు కేసు నమోదు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఇలాంటి దారుణాలు జరుగుతున్నప్పటికీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు నోరు మెదపకుండా అక్రమాలకు పాల్పడిన వారికి అండగా నిలబడటాన్ని ప్రశ్నించారు. వేల్పూరు గ్రామంలో పొగాకు కష్టాలు, వరి గూళ్లు, వరి గడ్డి వాములు బహిరంగంగా దహనం చేస్తుంటే పట్టించుకునే వారు లేరని, కనీసం కేసులు కూడా నమోదు చేయలేదని ఆవేదన వ్యక్తంచేశారు. వినుకొండలో నిర్వహించిన మహానాడుకు వ్యాపారస్తుల నుంచి చందాలు వసూలు చేశారని విమర్శించారు. తమ ప్రభుత్వం హయాంలో ఏ వ్యాపారిని బెదిరించలేదని, ఇబ్బంది పెట్టలేదని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వ్యాపారస్తులు కూడా భయపడుతున్నారని అన్నారు. వినుకొండలో వంద పడకల ఆసుపత్రికి ఐదెకరాల స్థలం కేటాయించామని, ముస్లిం మైనార్టీ కళాశాల, షాదీఖానాకు మరో ఐదెకరాలు కేటాయించామని, అభివృద్ధి పనులను పక్కన పెట్టి కూరగాయల మార్కెట్, రైతు బజారు, గ్రంథాలయం వంటి నిర్మాణాలను పట్టించుకోకుండా స్థానిక నాయకులపై దాడులు చేస్తూ అక్రమ కేసులు బనాయిస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారని అన్నారు. మీ అరాచకాలను ప్రజలు చూస్తున్నారని, గమనిస్తున్నారని సరైన సమయంలో బుద్ధి చెబుతారని అన్నారు. ఆయన వెంట పార్టీ ముఖ్యనాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా
కూటమి నాయకుల దాడిలో
గాయపడిన నర్సారెడ్డికి పరామర్శ