
అనధికారికంగా నడిచే పడవల సీజ్
అచ్చంపేట: ప్రభుత్వానికి చెల్లించాల్సిన సొమ్ము చెల్లించకుండా నిబంధనలకు విరుద్ధంగా కృష్ణానదిపై నడుపుతున్న పడవను విజిలెన్స్ సీఐ పాలేరు శివాజీ, విజిలెన్స్ ఎమ్మార్వో లక్ష్మీమాధవి శనివారం సీజ్ చేశారు. విజిలెన్స్ అధికారులు విలేకరులతో మాట్లాడారు. మండలంలోని గింజుపల్లి నుంచి కృష్ణానదికి ఆవలి ఒడ్డున ఉన్న పవిత్ర పుణ్యక్షేత్రమైన వేదాద్రికి పడవ నడుపుకునేందుకు ఈనెల 2న గుంటూరు జిల్లా పరిషత్ హాలులో బహిరంగ వేలం నిర్వహించినట్లు తెలిపారు. అచ్చంపేటకు చెందిన రాయిడి శ్రీనివాసరావు రూ.14లక్షలకు హక్కు పొందాడన్నారు. పాట సొమ్ములో రూ.1.32లక్షలు మాత్రమే చెల్లించి ఇంకా చెల్లించాల్సిన సొమ్ము రూ.12.68లక్షలు చెల్లించకుండా అధికారుల కళ్లు కప్పి నదిపై పడవ నడుపుకుంటూ సొమ్ము చేసుకుంటున్నాడని చెప్పారు. విశ్వసనీయ సమాచారం మేరకు దాడులు నిర్వహించి పడవను సీజ్ చేసినట్లు చెప్పారు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన పూర్తి సొమ్ము చెల్లించిన తర్వాత మాత్రమే పడవ నడుపుకోవాలని, ప్రభుత్వం నిర్ణయించిన ధరలు మాత్రమే వసూలు చేయాలని, నిబంధనలకు విరుద్ధంగా పడవ నడిపితే సహించేది లేదని విజిలెన్స్ అధికారులు హెచ్చరించారు. కార్యక్రమంలో అచ్చంపేట పోలీస్స్టేషన్ హెడ్కానిస్టేబుల్ బొల్లేపల్లి సత్యంరాజు, సిబ్బంది పాల్గొన్నారు.
అమరావతి: మండల పరిధిలోని దిడుగు గ్రామ ఇసుక రీచ్ నుండి కృష్ణాజిల్లా ఏటూరు వరకు ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా ప్రయాణికులను రవాణా చేస్తున్న పడవను శనివారం సాయంత్రం అధికారులు సీజ్ చేశారు. దిడుగు ఇసుకరీచ్లో పడవను జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓ సీహెచ్ కృష్ణ నేతృత్వంలో ఎంపీడీవో పార్వతి, ఎస్ఐ రాజశేఖర్, గ్రామపంచాయతీ సిబ్బంది సీజ్ చేశారు. ఎంపీడీవో పార్వతి మాట్లాడుతూ గత నెల 2వ తేదీన జిల్లా పరిషతఖ కార్యాలయం గుంటూరులో రేవులో పడవ నడుపుకొనుటకు వేలం నిర్వహించగా అందులో దిడుగు గ్రామానికి చెందిన మంచినేని హరనాథ్ రూ.50,01,116 వేలంపాటను దక్కించుకున్నారు. రూ.2,32000 చెల్లించి అప్పటి నుండి మిగిలిన సొమ్మును చెల్లించకుండా నోటీసులకు స్పందించకుండా ప్రయాణికులను రవాణా చేస్తున్నాడని గుర్తించామమన్నారు. పడవ రిజిస్ట్రేషన్, ఫిట్నెస్, సరంగు లైసెన్స్ మొదలగు పత్రాలు లేకుండా అక్రమంగా పడవ నడుపుతున్నందుకు సీజ్ చేశామని తెలిపారు. సీజ్ చేసిన పడవను అమరావతి పోలీసులకు అప్పగించి కేసు నమోదు చేయాలని షిపార్సు చేశామని తెలిపారు.

అనధికారికంగా నడిచే పడవల సీజ్