
పాలిసెట్కు ఉచిత శిక్షణ
క్రోసూరు: ఈనెల 30వ తేదీన నిర్వహించనున్న పాలిటెక్నిక్ కోర్సుల ప్రవేశ పరీక్షకు హాజరయ్యే విద్యార్థుల కోసం క్రోసూరు ప్రభుత్వ పాలిటిక్నిక్ కళాశాలలో ఉచిత కోచింగ్ తరగతులు నిర్వహిసున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ బీవీ రమాదేవీ బుధవారం తెలిపారు. పదవతరగతి పాసైన వారు, పదవతరగతి పరీక్షలు రాసిన విద్యార్థులు ఉచిత శిక్షణా తరగతులకు హాజరుకావచ్చునన్నారు. శిక్షణా తరగతులకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరుగుతోందని, ఈనెల 4వ తేదీ నుంచి ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 1 గంటవరకు తరగతులుంటాయన్నారు.
వైఎస్సార్ సీపీ కార్యకర్తలకు హైకోర్టులో ఊరట
గురజాల: పల్నాడు జిల్లా మాచవరం మండలం పిన్నెల్లి గ్రామానికి చెందిన 8 మంది వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై గతంలో జరగని గొడవను జరిగినట్లు సృష్టించి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఇప్పటికే చింతపల్లి పెద్ద సైదా, అల్లాభక్షులను అరెస్టు చేసి సబ్ జైల్లో రిమాండ్లో ఉంచారు. మిగిలిన ఆరుగురు వైఎస్సార్ సీపీ కార్యకర్తలు చింతపల్లి చిన మస్తాన్, పెద జానీబాషా, దస్తగిరి, చిన సైదా, జానీబాషా, జాన్ వలీలు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో వీరి తరఫున న్యాయవాది సానేపల్లి రామలక్ష్మణ రెడ్డి వాదించారు. బుధవారం న్యాయమూర్తి ఈ ఆరుగురిపై ఎటువంటి చర్యలు చేపట్టరాదని, అరెస్టు చేయవద్దని వారిని ఇబ్బందులు గురిచేయవద్దని తీర్పునిచ్చినట్లు న్యాయవాది రామలక్ష్మణరెడ్డి తెలిపారు.
గ్రానైట్ తరలింపు
లారీ పట్టివేత
ముప్పాళ్ళ: ఎటువంటి అనుమతి పత్రాలు లేకుండా గ్రానైట్ తరలిస్తున్న లారీని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అదుపులోకి తీసుకున్న సంఘటన మంగళవారం అర్ధరాత్రి జరిగింది. నరసరావుపేట – సత్తెనపల్లి ప్రధాన రహదారిలోని ముప్పాళ్ళ దర్గా సమీపంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి కె.చంద్రశేఖర్ తన సిబ్బందితో తనిఖీలు నిర్వహిస్తుండగా గ్రానైట్ లోడ్తో వెళుతున్న లారీని గుర్తించారు. లోడ్కు సంబంధించి ఎటువంటి పత్రాలు లేవని గుర్తించి తదుపరి చర్యలు నిమిత్తం లారీని పోలీసులకు అప్పగించారు.
కోచ్ సర్టిఫికెట్ కోర్సుకు దరఖాస్తు చేసుకోండి
జిల్లా స్పోర్ట్స్ అధికారి నరసింహారెడ్డి
నరసరావుపేట ఈస్ట్: క్రీడా శిక్షకుల ఆరు వారాల సర్టిఫికెట్ కోర్సుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు జిల్లా క్రీడాభివృద్ధి అధికారి పి.నరసింహారెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈమేరకు పటియాల నేతాజీ సుభాష్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ విడుదల చేసిందని తెలిపారు. ఏపీ క్రీడా ప్రాధికార సంస్థ అధికారి పి.ఎస్.గిరిషా, జిల్లా కలెక్టర్ పి.అరుణ్బాబు ఆదేశాల మేరకు మాస్ స్పోర్ట్స్ పార్టిసిపేషన్ ప్రోగ్రామ్లో భాగంగా మే 6వ తేదీ నుంచి జూలై 2 వరకు స్పోర్ట్స్ కోచింగ్ సర్టిఫికెట్ కోర్సులో ప్రవేశానికి ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు వివరించారు. అభ్యర్థులు తమ ధ్రువ పత్రాలతో http:// www.6wcc.nsnis.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.