
శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్న మంత్రి మేరుగ, ఎమ్మెల్సీ అప్పిరెడ్డి, ఎమ్మెల్యే గిరిధర్
రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ
పట్నంబజారు(గుంటూరు): నగరంలోని 39వ డివిజన్ ఉద్యోగనగర్లో నూతనంగా నిర్మించిన సిమెంట్ రోడ్డు, సైడ్ డ్రెయిన్లను రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున, ప్రభుత్వ విప్ లేళ్ల అప్పిరెడ్డి, పశ్చిమ ఎమ్మెల్యే మద్దాళి గిరిధర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ దేశంలోనే అభివృద్ధికి ఏపీ కేరాఫ్ అడ్రస్గా మారిందని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ప్రజా సంక్షేమ కార్యక్రమాలతో పాటు ప్రగతి పనులు కూడా ప్రణాళికాబద్ధంగా చేపట్టి పూర్తి చేస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ విప్, వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ అభివృద్ధిలో గుంటూరు నగరాన్ని రాష్ట్రంలోనే ఆదర్శవంతంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని, దశల వారీగా పనులు చేపట్టి నగర దశదిశ మార్చడమే ధ్యేయంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే మద్దాళి గిరి మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి గుంటూరు నగరం పూర్తి అధ్వానంగా ఉందని తెలిపారు. అటువంటి పరిస్థితి నుంచి దశల వారీగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి నగరాన్ని ప్రగతిబాట పట్టించిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానికే దక్కుతుందని వివరించారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ షేక్ జుమ్మాబీ, మార్కెట్ బాబు, గుంటూరు– 4 క్లస్టర్ అధ్యక్షుడు బందా రవీంద్రనాథ్, గుంటూరు– 2 క్లస్టర్ అధ్యక్షుడు నూనె ఉమామహేశ్వరరెడ్డి, స్థానిక పార్టీ నేతలు షఫి, మున్నా, ఏవీఎల్ మధు, పిల్లుట్ల మోహనరావు పాల్గొన్నారు.