
మెగా ఉద్యోగ మేళాలో 263 మంది ఎంపిక
కాశీబుగ్గ: రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ సూర్యతేజ జూనియర్ కళాశాల ఆవరణలో గురువారం మెగా జాబ్మేళా నిర్వహించారు. 763 మంది హాజరుకాగా అందులో 263 మంది వివిధ కంపెనీలకు ఎంపికయ్యారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన పలాస నియోజకవర్గ టీడీపీ సమన్వయకర్త యార్లగడ్డ వెంకన్నచౌదరి మాట్లాడుతూ జాబ్ మేళాకి హాజరైన ప్రతి నిరుద్యోగ యువత ఈ ఉద్యోగ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కళాశాల ప్రిన్సిపాల్ కరస్పాండెంట్ పద్మాజీ కామేశ్వరరావు మాట్లాడుతూ యువతలో ఉండాల్సిన నైపుణ్యాల ప్రాముఖ్యత గురించి వివరించారు. జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఉరిటి సాయికుమార్ మాట్లాడు తూ ఏ రంగంలో ఉద్యోగ అవకాశం వచ్చినా సరే దూరంతో సంబంధం లేకుండా అభ్యర్థులు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.