
రూ.లక్షల విలువైన సామగ్రి చోరీ
జయపురం: జయపురం సునారి వీధిలో గల ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆఫీసులో, గొదాంలో లక్షల రూపాయల విలువైన సామానులు చోరీకి గురైనట్లు హెచ్ఎం కె.సునీత పట్టణ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పాఠశాల గొదాంలో గల 50 కేజీల 24 బియ్యం బస్తాలు, 8 ఫ్యాన్లు, పుస్తకాలు ఉంచే ఇనుప అలమారా, వాటర్ మోటారు పైపు, మధ్యాహ్న భోజన వంట సామగ్రి, టీవీ, బెండింగ్ మిషన్, బియ్యం తూచే మిషన్, పిల్లలు ఆడుకొనే క్రీడా సామగ్రితోపాటు కొన్ని లక్షలు విలువ చేసే సామగ్రీ చోరికి గురైననట్లు ఆమె బుధవారం సాయంత్రం ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు. గురువారం పాఠశాలకు వెళ్లి దర్యాప్తు ప్రారంభించారు. పాఠశాల ప్రాంతంలో ఉన్న సీసీ ఫుటేజీలు పరిశీలించి దర్యాప్తు చేపట్టారు. వేసవి సెలవుల కారణంగా పాఠశాల మూసి ఉంచారు. అన్ని గదులతోపాటు పాఠశాల తలుపులకు తాళాలు వేశారు. ఈ నెల 18వ తేదీన పాఠశాల తెరవాల్సి ఉండగా.. ముందుగా పాఠశాల పరిశుభ్ర పరిచేందుకు పాఠశాలలో ఉన్న సామగ్రి, వస్తువులు పరిశీలించేందుకు హెచ్ఎంతోపాటు ఉపాద్యాయులు పాఠశాలకు వచ్చారు. పాఠశాల బయట గేటు తాళాలు వేసి ఉన్నాయి. గేటు తెరచి లోపలకు వెళ్లిన వారికి పాఠశాల ఆఫీస్ తలుపు తాళాలు విరిచి ఉన్నాయి. లోపలికి వెళ్లిన వారికి బీరువా తెరిచి ఉండటం కనిపించింది. సామానులు చిందరవందరగా పడి ఉన్నాయి. పిల్లల పుస్తకాలు ఉంచే 2 అడుగుల వెడల్పు, 6 అడుగుల పొడవు గల ఇనుప అలమారా కనిపించ లేదు. బియ్యం నిల్వ ఉంచే మరో గది తాళాలు బయట పడి ఉన్నాయి. ఆ గది గోడ కొంత భాగం పడగొట్టి టిన్ రూఫ్ను తొలగించి 50 కేజీల బరువుగల 24 బియ్యం బస్తాలను దొంగిలించుకుపోయారు. పాఠశాలలో దొంగతనంగా బియ్యం బస్తాలను దొంగిలించుకుపోతుండటం బియ్యం గది పక్కన కూర్చొని మద్యం సేవిస్తున్న వారు చూచినట్లు వెల్లడైంది. పాఠశాలలో దొంగతనం జరిగిన సమాచారం అందిన జయపురం బ్లాక్ విద్యాధికారి చందన నాయక్ పరిస్థితిని తెలుసుకోవాలని సి.ఆర్.సి.ఎస్ విజయ లక్ష్మీ పాణిగ్రహిణి పంపారు. ఆమె పాఠశాలకు వచ్చి ప్రధాన ఉపాద్యాయురాలితోపాటు ఉపాద్యాయులందరితో చర్చించించారు. ఆ చర్చల్లో జయపురం సమితి ఉపాద్యాయ సంఘం సంఘ అధ్యక్షుడు దేవీ ప్రసాద్ దాస్, వంట సిబ్బంది పాల్గొన్నారు. జయపురంలో ఇటీవల పాఠశాలల్లో దొంగతనాలు జరుగుతున్నాయని, కొద్ది రోజుల కిందట జయపురం జయనగర్ ఉన్నత పాఠశాలలో జరిగిన దొంగతనాన్ని పరిశీలకులు గుర్తుచేస్తున్నారు. 72 ఏళ్ల కిందట ఏర్పాటు చేసిన సునారి వీధి పాఠశాలలో దొంగతనం జరగటం ఇదే మొదటిసారి అని అంటున్నారు. పోలీసులు దొంగతనాలు అరికట్టేందుకు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

రూ.లక్షల విలువైన సామగ్రి చోరీ