
భర్త ఇంటి ముందు భార్య నిరసన
శ్రీకాకుళం క్రైమ్ : కట్టుకున్న భర్తే రోడ్డుపై గెంటేశాడని.. కోర్టులో విడాకులు మంజూరు కాకుండానే వేరే మహిళను వివాహం చేసుకున్నాడని.. ఆ ఇంట్లో వెళ్లి ఉండాలని పోలీసులు చెప్పినా తనను రానీయకుండా అడ్డుపడుతున్నాడంటూ దొండపాటి మంజుశ్రీ అనే వివాహిత వాపోయారు. ఈ మేరకు మంగళవారం బలగలో తన భర్త ఇంటి ముందు నిరసన వ్యక్తం చేశారు.. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బలగకు చెందిన దొండపాటి విశ్వనాధం, దమయంతిల కుమారుడు ఉమానవీన్కుమార్తో 2012 ఆగస్టులో తనకు వివాహం జరిగిందని, కొన్ని నెలలకే అదనపు కట్నంకోసం అత్తింటి వేధింపులు మొదలయ్యాయని చెప్పారు. బాబు పుట్టాక ఇంటి నుంచి గెంటేయడంతో కాకినాడలో ఉన్న తల్లి వద్దకు చేరానని, 2014 జనవరిలో సర్పవరం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశానని తెలిపారు. అనంతరం కోర్టును ఆశ్రయించానని చెప్పారు. 2018లో మెయింటెనెన్సు కేసు తనకు ఫేవర్ వచ్చిందని, అయినా డబ్బులు తక్కువగా ఇస్తూ, విడాకులైనా తీసుకోకుండా.. మరొక మహిళను పెళ్లి చేసుకున్నాడని తెలిపారు. ఇటీవల ఎస్పీ మహేశ్వరరెడ్డిని కలవగా సీఐ ఈశ్వరరావు ద్వారా విచారణ నివేదిక కాగితం ఇచ్చారని, దానిని పట్టుకుని మంగళవారం బలగలోని తన భర్త ఉంటున్న నివాసం వద్దకు చేరితే మెడ పట్టుకుని కొడుకుతో సహా తనను గెంటేశారని వాపోయారు.