
బంగారం కోసం వచ్చి.. ప్రాణాలు తీసి
టెక్కలి రూరల్: కోటబొమ్మాళి మండలం పెద్ద హరిచంద్రపురం గ్రామంలో మంగళవారం దుంపల దాలమ్మ(68) అనే వృద్ధురాలిని హత్య చేశారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. దాలమ్మ తన ఇంటిలో ఒంటరిగా నివసిస్తున్నారు. పిల్లలు విశాఖపట్నంలో ఉంటున్నారు. దాలమ్మ భర్తకు ఆరోగ్యం సరిగా లేకపోవడంతో ఆయన కుమారుడి వద్ద ఉంటున్నారు. రోజూ మాదిరిగానే మంగళవారం ఉదయం 3గంటల సమయంలో ఆమె నిద్ర లేచి పనులు చేసుకుంటూ ఉండగా.. ఇంటి పెరటి నుంచి గుర్తు తెలియని వ్యక్తి వచ్చి ఆమె మెడలో తాడు లాగబోయాడు. ఆ ప్రయత్నంలో తలపై కొట్టిన ఆనవాళ్లు కనిపించాయని పోలీసులు తెలిపారు. ఆ ధాటికి దాలమ్మ సంఘటన స్థలంలోనే మృతి చెందారు. ఉదయం పక్కింటి వాళ్లు చూసే సరికి దాలమ్మ రక్తపు మడుగులో కనిపించడంతో వారు వెంటనే పోలీసులకు సమాచారం అందజేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. అనంతరం మృతురాలి కుమారుడు రామారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ వి.సత్యనారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.