
సామూహిక ఉపనయనాలు
రాయగడ: జిల్లాలోని గుణుపూర్లో గల తిరుపతి బాలాజీ మందిరం ప్రాంగణంలో బ్రహ్మణ సేవా సమాజం ఆధ్వర్యంలో రెండు రోజులు పాటు సామూహిక ఉపనయనాలు జరిగాయి. ఉచితంగా నిర్వహించిన కార్యక్రమంలో పది మంది బ్రహ్మచారులు ఈ దీక్షను పాటించారు. పండితులు ప్రకాష్ రథొ, నళినీ మహాంతిల పర్యవేక్షణలో జరిగిన ఉపపనయనాల కార్యక్రమం మంగళవారం ముగిసింది.
చెట్టును ఢీకొట్టిన టిప్పర్
● పలువురికి స్వల్పగాయాలు
రాయగడ: టిప్పర్ అదుపుతప్పి చెట్టును ఢీకొంది. ఈ ఘటన జిల్లాలోని కొలనార సమితి గడ్డిశెశిఖాల్ పంచాయతీలొని కొలటిగుడ గ్రామసమీపంలో మంగళవారం ఉదయం చోటు చేసుకుంది. టిప్పర్లో ప్రయాణించే హెల్పర్, డ్రైవర్లకు స్వల్పగాయాలు తగిలాయి. ప్రమా దం చోటు చేసుకున్న సమయంలో అక్కడ ఉన్న యువకులు టిప్పర్లో ఉన్న హెల్పర్ , డ్రైవర్లను బయటకుతీసి కొలనార ఆస్పత్రికి చికిత్స కోసం తరలించారు. సమాచారం తెలుసుకున్న చందిలి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ప్రమాదంలో టిప్పర్ నుజ్జునుజ్జు అయింది.
చోరీ కేసులో నిందితుడి అరెస్టు
రాయగడ: మునిగుడ రైల్వే పోలీసులు సోమవారం నాడు అనుమానాస్పదంగా కనిపించిన ఒక ప్రయాణికుడిని అరెస్టు చేశారు. అతని నుంచి తొమ్మిది మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. అరెస్టయిన వ్యక్తి ఛత్తీస్గఢ్ రాష్ట్రం రాయిపూర్ ప్రాంతానికి చెందిన అజయమీ సాహు (25)గా గుర్తించారు. ఆర్పీఎఫ్ ఏఎస్ఐ కె.స్వయం ప్రకాష్ తెలియజేసిన వివరాల ప్రకారం.. సొమవారం రైల్వే స్టేషన్లో ఆర్పీఎఫ్ సిబ్బంది తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో ఒకటో నంబరు ప్లాట్ఫారం వద్ద సాహు అనుమానాస్పదంగా కనిపించాడు. దీంతో అతని వద్ద ఉన్న బ్యాగును తనిఖీలు చేయగా స్మార్ట్ మొబైల్ ఫోన్లు తొమ్మిది కనిపించడంతో వాటిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతనిని విచారించగా వివిధ రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల నుంచి వీటిని దొంగిలించినట్టు అంగీకరించాడు. అతనిపై పోలీసులు కేసు నమోదు చేసి కోర్టుకు తరలించారు.
ఇంట్లో దొంగలు పడి
రూ.20 లక్షలు చోరీ
కొరాపుట్: కొరాపుట్ జిల్లా సిమిలిగుడ పట్టణం నుంచి నందపూర్ వెళ్లే మార్గంలో కుశల ఆశ్రమ ప్రాంతంలో శత్రుఘ్న ప్రధాన్ అనే వ్యక్తి ఇంటిలో మంగళవారం వేకువజామున దొంగలు పడ్డారు. ఉదయం ఇంటికి వచ్చిన కుటుంబం దొంగతనం జరిగినట్లు గుర్తించారు. ఈ చోరీలో రూ.10 లక్షల నగదుత పాటు మరో రూ.10 లక్షల విలువైన బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్లు తెలిపారు. వెంటనే బాధితులు సిమిలిగుడ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా వారు సంఘటన స్థలానికి వచ్చి దర్యాప్తు ప్రారంభించారు.
రైలు నుంచి జారిపడి యువకుడి మృతి
రాయగడ: నడుస్తున్న రైలు నుంచి ప్రమాదవశాత్తు జారిపడి యువకుడు మృతి చెందాడు. ఎల్లపి–ధన్బాద్ ఎక్స్ప్రెస్లో జార్ఖండ్కు చెందిన బిజయ్ భుయ్య (34) ప్రయాణిస్తున్నాడు. సోమవారం సాయంత్రం రాయగడ రైల్వే స్టేషన్లో ఐదో నంబర్ ప్లాట్ఫారంపైకి రైలు చేరుకుంటున్న సమయంలో భుయ్య దిగేందుకు ప్రయత్నించిగా ప్రమాదవశాత్తు కిందపడిపోవడంతో ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో సంఘన స్థలం వద్దే ప్రాణాలు కోల్పోయాడు. రైల్వే పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

సామూహిక ఉపనయనాలు

సామూహిక ఉపనయనాలు