
వ్యాన్, బైక్ ఢీకొని ఒకరి మృతి
రాయగడ: ఆంధ్రప్రదేశ్ నుంచి భిలాయికి మామిడి పండ్ల లోడుతో వెళ్తున్న పికప్ వ్యాన్ అదుపుతప్పి ఎదురుగా వస్తున్న బైకును ఢీకొట్టింది. ఈ సంఘటనలో బైకు డ్రైవ్ చేస్తున్న బి.రాహుల్ (24) అనే యువకుడు మృతి చెందాడు. మృతుడు స్థానిక మజ్జివీధికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. సోమవారం రాత్రి చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలియజేసిన వివరాల ప్రకారం.. స్థానిక జగన్నాథ మందిరం సమీపంలో పికప్ వ్యాన్ అతివేగంగా నడుపుతూ మరో వాహనాన్ని తప్పించే క్రమంలో ఎదురుగా వస్తున్న బైకును ఢీకొన్నాడు. దీంతో తీవ్రగాయాలకు గురైన రాహుల్ను అక్కడి వారు స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. వ్యాన్ డ్రైవర్ నకుల ప్రసాద్ వాహనాన్ని విడిచిపెట్టి పరారయ్యాడు. వ్యాన్ హెల్పర్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
చందిలి ఐఐసీగా
ఉత్తమ కుమార్సాహు
రాయగడ: జిల్లాలోని చందిలి పోలీస్స్టేషన్ ఐఐసీగా ఉత్తమ కుమార్ సాహు మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. గుణుపూర్ ఆదర్శ పోలీస్స్టేషన్లో ఐఐసీగా విధులు నిర్వహిస్తున్న సాహు బదిలీపై ఇక్కడకు వచ్చారు. చందిలి ఐఐసీగా విధులు నిర్వహించిన ప్రసన్న బెహరకు రాయగడ బదిలీ అయింది. బాధ్యతలు చేపట్టిన ఐఐసీ సాహుకు చందిలి పోలీస్ స్టేషన్ సిబ్బంది పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికి అభినందించారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై చర్చ
జయపురం: జయపురం సబ్డివిజన్ కోట్పాడ్లో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్సెల్లో పాల్గొనేందుకు వచ్చిన కొరాపుట్ జిల్లా కలెక్టర్ వి.కీర్తివాసన్, జయపురం సబ్కలెక్టర్ కుమారి అక్కవరం శొశ్యా రెడ్డిలు వినతుల స్పీకరణ అనంతరం ఘుమర, బొబాయి, కుసుమి, కొట్పాడ్లలో ఏర్పాటు చేయనున్న మార్కెడ్ యార్డ్లను సందర్శించి పరిశీలించారు. ఆయా ప్రాంతాలలో రోడ్లపై ఆరబెట్టిన ధాన్యాన్ని పరిశీలించారు. అనంతరం కోట్పాడ్ బీడీవో, ఇతర అధికారులతో మండీల నిర్వహణపై చర్చించారు. కాగా గ్రీవెన్స్సెల్కు 120 వినతులు వచ్చాయి. వీటిలో 30 వ్యక్తిగతం కాగా 90 గ్రామ సమస్యలపై ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. సీడీవో బేణూదర శబర, సీడీఎంవో రవీంద్ర నారాయణ మిశ్ర, తహసీల్దార్ ట్వింకిల్ సెట్టి, బడీవో సంధ్యా సమరత్ పాల్గొన్నారు.