
ఉరి వేసుకుని యువకుడి ఆత్మహత్య
జయపురం: తలుపులు మూసి ఉన్న ఒక ఇంటిలో ఒక యువకుడు ఉరి పోసుకొని చనిపోయిన ఘటన బయటపడింది. మరణించిన యువకుడు మధ్యప్రదేశ్ రాష్ట్రం సివన్ జిల్లా ఉగిలి గ్రామం లోకేష్ బైసావర్ అని గుర్తించారు. ఈ సంఘటనపై జయపురం సదర్ పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు పోలీసు అధికారి సచీంద్ర ప్రధాన్ వెల్లడించారు. పోలీసులు సైంటిఫిక్ టీమ్లు సంఘటనా ప్రాంతానికి వెళ్లి దర్యాప్తు ప్రారంభించారు. పోస్టుమార్టం తర్వాత మృత దేహాన్ని అతడి కుటుంబ సభ్యులకు అప్పజెప్పినట్లు పోలీసు అధికారి సచీంధ్ర ప్రధాన్ వెల్లడించారు. పోలీసు అధికారి వివరణ ప్రకారం.. సదర్ పోలీసు స్టేషన్ పరిధి గేట్గుడ గ్రామంలో సంజిత్ నాయిక్ హైడ్రోలిక్ గేరేజ్లో లోకేష్ గత 6 నెలల నుంచి మెకానిక్ హెల్పర్గా పనిచేస్తున్నాడు. గత ఏప్రిల్లో సెలవు తీసుకొని ఇంటికి వెళ్లాడు. ఈ నెల 7వ తేదీన ఇంటి నుంచి తిరిగి వచ్చిన పనిలో చేరాడు. సోమవారం 10 గంటల వరకు లోకేష్ గేరేజ్కు రాలేదు. అతడు రాకపోవడంతో లోకేష్ను పిలుచుకు రమ్మని ఒక వ్యక్తిని అతడి ఇంటికి పంపాడు. ఇంటి లోపల గెడ వేసి ఉండటంతో వెళ్లిన వ్యక్తి తలుపు తట్టి పిలిచాడు. తలుపు తెరవకపోవడంతో కిటికీ నుంచి చూడగా లోకేష్ ఉరికి వేలాడుతూ కనిపించాడు. ఈ విషయాన్ని అతడు గేరేజ్ యజమాని సంజిత్కు తెలియజేశాడు. యజమాని సంజిత్ జయపురం సదర్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు.