
ఈపీఎఫ్ పింఛన్ రూ. పది వేలకు పెంచాలి
జయపురం: తమ న్యాయమైన డిమాండ్లు వెంటనే నెరవేర్చాలని కొరాపుట్ జిల్లా ఈపీఎఫ్ పింఛన్దారుల అసోసియేషన్ నాయకులు కోరారు. ఈ మేరకు స్థానిక యాదవ భవనంలో అసోసియేషన్ అధ్యక్షుడు నళిణీకాంత రథ్ అద్యక్షతన సోమవారం జరిగిన సమావేశంలో పలు విషయాలపై చర్చించారు. నళిణీ కాంత రథ్ మాట్లాడుతూ.. నిత్యావసర ధరలు చుక్కలను తాకుతుండడంతో పింఛన్దారులు తమ కుటుంబ పోషణ దుర్భర మౌతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈపీఎఫ్ పింఛన్ను నెలకు రూ. తొమ్మిది వేలు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నా పాలకులు పట్టించుకోవటం లేదని వాపోయారు. అలాగే డీఏతో పాటు వైద్య సౌకర్యం కల్పించాలని కోరుతున్నా చెవిటి వాని ముందు శంఖం ఊదిన చందమే అవుతోందన్నారు. డిమాండ్ల సాధనకు జరుపుతున్న ఆందోళనను ఇక ముందు కూడా సాగించాలని పిలుపు నిచ్చారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల సమయంలో దేశంలో 70 లక్షలకు పైగా ఉన్న ఈపీఎఫ్ పెన్షనర్ల డిమాండ్లను పార్లమెంట్లో ప్రస్తావించేందుకు వివిధ రాజకీయ పార్టీల నేతలు, ఆలిండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (ఏఐడీయూసీ) సాధారణ కార్యదర్శి అమరజిత్ కౌర్, సీఐటీయూ కార్యదర్శి తపన్ సేన్, భారతీయ మజుదూర్ సంఘ్ (బీఎంఎస్) నేత గిరీష్ చంద్ర, ఐఎన్టీయూసీ నేత పి.కె.రాజులతో పాటు పలువరు నాయకులతో ఈపీఎఫ్ జాతీయ నేతలు చర్చలు జరిపినట్లు వెల్లడించారు. ఈపీఎఫ్ పింఛన్దారులు పనులు చేసే సమయంలో వారి జీతం నుంచి పీఎఫ్ కట్ చేసి జమ చేసేవారని.. అందులో కొంత శాతం ఖర్చు చేసినా వృద్ధాప్య సమయంలో వారి జీవనానికి మంచి పింఛన్ పొందేవారని అభిప్రాయపడ్డారు. వివిధ రాష్ట్రాలలో వృద్ధాప్య పింఛన్ మూడు వేల రూపాయల వరకు ఇస్తున్నాయని తెలిపారు. మోదీ ప్రభుత్వం ఎక్కువ పింఛన్ లభిస్తుందని విస్తృతంగా ప్రచారం చేస్తున్నప్పటికీ ఆచరణలో అమలు కావడం లేదని విమర్శించారు. సమావేశంలో అసోసియేషన్ సభ్యులు ఎన్.ఎస్.మూర్తి, అచ్యుత మాలీ, కేశవ చంద్రపండ, పి.గౌరీశంకర రావు, ఉమా రథ్, బసంత బెహర పాల్గొన్నారు.
అసోసియేషన్ నాయకుల డిమాండ్