
చికిత్సకు డబ్బుల్లేక..
జయపురం: మెరుగైన వైద్యం చేయించుకునేందుకు డబ్బుల్లేక మరో సేవాపేపరుమిల్లు కార్మికుడు మరణించినట్లు మిల్లు ప్రథమ యూనియన్ అధ్యక్షుడు ప్రమోద్కుమార్ మహంతి వెల్లడించారు. మరణించిన వ్యక్తి బలభధ్ర జెన అని వెల్లడించారు. నేటి వరకు 41 మంది సేవా కార్మికులు తగిన వైద్యం పొందలేక మరణించినట్లు మహంతి తెలిపారు. గత 10 నెలలుగా కార్మికులకు జీతాలు లేవని, మిల్లులో ఉత్పత్తి బందు అయిందని ఆయన పేర్కొన్నారు. ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించాలని విజ్ఞప్తి చేసినా ఫలితం లేదన్నారు. మిల్లు అమ్మివేసి పునరుద్ధరణకు రెండు సార్లు రూ.200 కోట్లు అప్పు చేశారని, అయినా మిల్లు మూత పడి ఉందని, ఇది విచారకరమైన విషయమన్నారు. మరోసారి మిల్లు నడిపేందుకు పెట్టుబడి పెడుతున్న మరో సంస్థకు రుణం కల్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, అయినా కార్మికుల విషయం ఎవరూ పట్టించుకోవటంలేదని కార్మిక నేత ప్రమోద్ మహంతి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయం పై త్వరలో రాష్ట్ర ప్రభుత్వ సహాయంతో శాశ్వత పరిష్కారం కోసం ప్రయత్నించనున్నట్లు తెలిపారు.