
అభివృద్ధి పనులు ప్రారంభం
పర్లాకిమిడి: రాష్ట్ర పంచాయతీ రాజ్, తాగునీరు, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి రబినారాయణ నాయక్ గజపతి జిల్లాలో ఒక రోజు పర్యటించారు. ఆయన శనివారం వేకువ జామున పర్లాకిమిడి విచ్చేశారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు నబకిశోర్ శోబోరో మంత్రిని స్వాగతించారు. మంత్రి రబినారాయణ నాయక్ కాశీనగర్ సమితిలో శియ్యాలీ, అల్లాడ, పాలసింగిలో ప్రభుత్వం ద్వారా అమలు జరుగుతున్న ’అమృత్ సరోవర్ పథకం’ పనులను పర్యవేక్షించారు. అనంతరం పలుచోట్ల మొక్కలు నాటారు. అలాగే కాశీనగర్ బ్లాక్ ఖండవ పంచాయతీలో పాలసింగిలో గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన ‘మెగా తాగునీటి పథకం’ పైపులు విరిగిపోవడం రాష్ట్ర మంత్రి దృష్టికి ప్రజలు, పార్టీ నాయకులు తీసుకువచ్చారు. దీంతో గ్రామీణ తాగునీరు, శానిటేషన్ శాఖ ఇంజినీర్లకు మంత్రి రబినాయక్ చీవాట్లు పెట్టారు. పనులు తక్షణమే పూర్తి చేయాలని ఆదేశించారు. కలెక్టర్ ద్వారా వికసిత్ గావ్, వికసిత్ ఒడిశా కింద పదకొండు గ్రామాలకు తాగునీరు, రోడ్లు నిర్మాణానికి రూ.55.50 లక్షలతో పనులకు ఆయన కలెక్టరేట్ వద్ద శంకుస్థాపన చేశారు. అనంతరం కలెక్టర్ కార్యాలయం కాన్ఫరెన్సు హాలులో జిల్లాలోని త్రాగునీరు, రోడ్లు–భవనాలు, గ్రామీణ శానిటేషన్, త్రాగునీరు, చిన్ననీటి పారుదలశాఖ, ఇంజినీర్లు అధికారులతో సమీక్ష సమావేశం జరిపారు. గజపతి జిల్లాలో అమృత్ సరోవర్ కింద సాగునీరు, తాగునీటి పథకాలు రుతుపవనాలు వచ్చే ముందే పూర్తిచేయాలని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన పాలసింగి మెగా తాగునీరు, సాగునీటి ప్రాజెక్టుల్లో అవకతవకలు సరిదిద్దాలని కలెక్టర్తో అన్నారు. ఒడిషా ప్రాజెక్టుల ద్వారా పోరుగున వున్న ఆంధ్రప్రదేశ్ రైతులు వినియోగించుకుంటున్నారని, మన రైతులు సద్వినియోగం చేసుకోలేక పోతున్నారని సమీక్షా సమావేశానంతరం విలేకరులతో అన్నారు. అనంతరం దక్షిణ ఒడిషా వికాస్, శిక్షణ పొందిన 18 మందికి ఉపాధ్యాయ నియామక పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో మోహన ఎమ్మెల్యే దాశరథి గోమాంగోతో పాటు కలెక్టర్, డీఎఫ్ఓ ఎన్.నాగరాజు, డీఆర్డీఏ ముఖ్యకార్యనిర్వాహణ అధికారి శంకర్ కెరెకెటా, ఏడీఎం ఫాల్గుణ మఝి, అదనపు సీడీఎం ఫృధ్వీరాజ్ మండళ్ తదితరులు పాల్గొన్నారు.

అభివృద్ధి పనులు ప్రారంభం

అభివృద్ధి పనులు ప్రారంభం