టెక్కలి రవీంద్రభారతి పాఠశాలకు తాళాలు | - | Sakshi
Sakshi News home page

టెక్కలి రవీంద్రభారతి పాఠశాలకు తాళాలు

Jun 8 2025 12:32 AM | Updated on Jun 8 2025 12:32 AM

టెక్క

టెక్కలి రవీంద్రభారతి పాఠశాలకు తాళాలు

టెక్కలి: టెక్కలిలో రవీంద్రభారతి పాఠశాలకు శనివారం మండల విద్యా శాఖాధికారి దల్లి తులసీరెడ్డి తాళాలు వేశారు. విద్యాశాఖ నుంచి ఎటువంటి గుర్తింపు అనుమతులు లేకపోవడంపై పలుమార్లు హెచ్చరించినా సంబంధిత యాజమాన్యం స్పందించకపోవడంతో పాఠశాలను శాశ్వతంగా మూసివేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎల్‌కేజీ నుంచి 7వ తరగతికి సంబంధించి విద్యా శాఖ నుంచి ఏటా అనుమతులు తీసుకోకుండా తాత్సారం చేశారని, దీనిపై పలుమార్లు హెచ్చరించినా స్పందించకపోవడంతో జిల్లా అధికారుల ఆదేశాలతో పాఠశాలను మూసివేసినట్లు పేర్కొన్నారు. విద్యార్థుల బదిలీ సర్టిఫికెట్లు(టీసీ)లను తమ కార్యాలయం ద్వారా అందజేస్తామని తెలిపారు. కాగా, పాఠశాల మూసివేయడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

చెరువులో ఆక్రమణలు అడ్డగింత

నరసన్నపేట: స్థానిక నరసన్న చెరువును శ్రీరామనగర్‌ సమీపంలో కొందరు వ్యక్తులు ఆక్రమణలకు పాల్పడగా రెవెన్యూ సిబ్బంది స్పందించి అడ్డుకున్నారు. మాజీ సైనికులకు 1991లో చెరువు గర్భంలో పట్టా ఇచ్చారంటూ కొందరు శనివారం చెరువు భాగంలో ఉన్న జంగిల్‌ను జేసీబీతో శుభ్రం చేయించారు. స్థానికులు స్పందించి తహసీల్దార్‌ సత్యనారాయణ దృష్టికి తీసుకెళ్లడంతో వెంటనే ఆయన స్పందించి ఆర్‌ఐ సాయిరాంకు తగు సూచనలు చేశారు. ఈ మేరకు వీఆర్వో చెరువు వద్దకు వెళ్లి పనులు అడ్డుకున్నారు. అనుమతి లేకుండా పనులు చేస్తే కఠిన చర్యలు తప్పవని తహసీల్దార్‌ హెచ్చరించారు.

ట్రాక్టర్‌ ఢీకొని మహిళ మృతి

పోలాకి : రాజపురం వద్ద మట్టి ట్రాక్టర్‌ ఢీకొని ఓ మహిళ మృతిచెందింది. కోలకతాకు చెందిన నౌగాన ఆదిలక్ష్మి(54) బెలమర గ్రామంలో ఉన్న తన కుమార్తె ఇంటికి వచ్చింది. శనివారం సాయంత్రం గుల్లవానిపేట బీచ్‌కు కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లి తిరిగి వస్తుండగా.. అటుగా మట్టి తీసుకొస్తున్న ట్రాక్టర్‌ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆదిలక్ష్మి అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలాకి ఎస్‌ఐ రంజిత్‌ ఘటనా స్థలానికి చేరుకుని ట్రాక్టర్‌ను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నరసన్నపేట ఆస్పత్రికి తరలించనున్నట్లు తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో

క్లీనర్‌ దుర్మరణం

ఎచ్చెర్ల: చిలకపాలెం ఫ్లై ఓవర్‌ బ్రిడ్జిపై శనివారం వేకువజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో పశ్చిమబెంగాల్‌కు చెందిన లారీ క్లీనర్‌ సుబకాస్‌ మర్మర్‌ (35) మృతిచెందగా.. అస్సాంకు చెందిన డ్రైవర్‌ అసింనాథ్‌ గాయాలపాలయ్యారు. గౌహతి నుంచి బెంగళూరు వెళ్తున్న కొరియర్‌ లారీ చిలకపాలెం వద్దకు వచ్చేసరికి ముందు వెళ్తున్న వాహనాన్ని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. క్షతగాత్రులను 108 అంబులెన్సులో రిమ్స్‌కు తరలించగా చికిత్స పొందుతూ క్లీనర్‌ మృతి చెందాడు. ఎచ్చెర్ల ఎస్సై ఎన్‌.కృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు

టెక్కలి రూరల్‌: మండలంలోని బర్మాకాలనీ సమీపంలో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. టెక్కలి నుంచి రావివలస వైపు వెళ్తున్న ఆటోను ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న చాకిపల్లి కొత్తూరు గ్రామానికి చెందిన పొన్నాడ రవి గాయపడ్డాడు. క్షతగాత్రుడిని స్థానికులు టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించారు. టెక్కలి పోలీసులు వివరాలు సేకరించి దర్యాప్తు చేస్తున్నారు.

లీజుకు ఆర్టీసీ ఖాళీ స్థలాలు

శ్రీకాకుళం అర్బన్‌: జిల్లాలో వివిధ బస్‌స్టేషన్లలో 6 ఖాళీ స్థలాలను 15 ఏళ్ల లీజుకు ఇచ్చే ప్రాతిపదికన టెండర్లు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి ఎ.విజయకుమార్‌ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇచ్ఛాపురం, టెక్కలి, ఆమదాలవలస, ఎచ్చెర్లలో ఖాళీ స్థలాలకు సంబంధించి ఈ నెల 10న ఉదయం 11 గంటలకు శ్రీకాకుళం డ్రైవర్ల శిక్షణా కళాశాలలో ప్రీ బిడ్డర్ల సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. టెండర్‌ డాక్యుమెంట్లు, స్థలాల వివరాలను డ్రాయింగ్‌ ఆర్టీసీ వెబ్‌సైట్‌లో పొందుపర్చినట్టు పేర్కొన్నారు. పూర్తి వివరాలకు 93460 45369 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.

టెక్కలి రవీంద్రభారతి   పాఠశాలకు తాళాలు 1
1/2

టెక్కలి రవీంద్రభారతి పాఠశాలకు తాళాలు

టెక్కలి రవీంద్రభారతి   పాఠశాలకు తాళాలు 2
2/2

టెక్కలి రవీంద్రభారతి పాఠశాలకు తాళాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement