
ఫుల్బణిలో ప్రభుత్వ వైద్య కళాశాల, ఆస్పత్రి: సీఎం
భువనేశ్వర్: ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ శనివారం కంధమల్ జిల్లా ఫుల్బణి ప్రాంతంలో ప్రభుత్వ వైద్య కళాశాల, ఆస్పత్రిని ప్రారంభించారు. జిల్లా సందర్శన పురస్కరించుకుని రూ. 750 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయగా మరికొన్నింటిని ప్రారంభించారు. కొత్తగా ప్రారంభించిన ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రిలో 100 సీట్లు, 650 పడకలు ఉన్నాయని ప్రకటించారు. కంధమల్ జిల్లా వాసుల చిరకాల ఆశ నెరవేరిందని, మెరుగైన ఆరోగ్య సంరక్షణ సేవలను పొందాలనే వారి చిరకాల కల సాకారమైందని ముఖ్యమంత్రి ఆనందం వ్యక్తం చేశారు. కంధమల్ ప్రాంతంలో ఈ వైద్య కళాశాల వైద్య విద్యను అందించడంతో నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ సేవలను కూడా అందిస్తుందన్నారు. పరిసర ప్రాంతాల ప్రజల జీవితాల్లో పెద్ద మార్పు తీసుకురావడానికి దోహద పడుతుందని ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.
ఆరోగ్య సేవా రంగంలో పేరుకు పోయిన పలు అవకతవకలు, అసమానతలను సవరించి వైద్య విద్యతో ప్రజలకు నాణ్యమైన, ఆరోగ్య సేవలను నిరంతరం అందుబాటులో ఉండేలా చేయడం ప్రభుత్వ సంకల్పంగా పేర్కొన్నారు. ఆరోగ్యవంతమైన రాష్ట్రంగా తీర్చిదిద్ది సుసంపన్నంగా మార్చడానికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
రాష్ట్రంలో కొత్త వైద్య కళాశాల ఆసుపత్రులు స్థాపించడంతో వైద్య పోస్టుల సంఖ్యను పెంచడం పట్ల ప్రభుత్వం దృష్టి సారిస్తుందన్నారు. రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం సామాన్యుల ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తుందని, రాష్ట్రంలో మెరుగైన ఆరోగ్య సేవలను అందించే దిశగా మరో అడుగు ముందుకు వేస్తూ ఫుల్బణి ప్రాంతంలో కొత్త వైద్య కళాశాల ఆస్పత్రి ప్రారంభించడం సమగ్ర రాష్ట్రంలోనే ఆరోగ్య సంరక్షణలో కొత్త అధ్యాయాన్ని ఆవిష్కరించడం జరిగిందని ముఖ్యమంత్రి అన్నారు. ప్రభుత్వం ఆరోగ్య సంరక్షణకు అత్యధిక ప్రాధాన్యత కల్పిస్తుందన్నారు. ఈ ఏడాది బడ్జెటులో ఆరోగ్య రంగానికి భారీగా రూ. 23,635 కోట్లు కేటాయించారని,
ఇది బడ్జెట్ సమగ్ర పరిమాణంలో 8.2 శాతమని, ఇది రాష్ట్ర చరిత్రలో అత్యధికమని పేర్కొన్నారు.
ఫుల్బణి వైద్య కళాశాల ఆస్పత్రి కంధమల్, పరిసర ప్రాంతాల యువతకు వైద్య విద్యాభ్యాసంలో సరికొత్త అవకాశాలకు తలుపులు తెరిచిందన్నారు. 100 సీట్ల సామర్థ్యం గల ఈ కళాశాల నుంచి పట్టభద్రులైన తర్వాత వైద్య నిపుణులు భవిష్యత్లో ఒడిశాాలోనే కాకుండా జాతీయ స్థాయి ఆరోగ్య సేవలు కల్పించడంలో ముఖ్యమైన పాత్ర పోషించాలని ప్రోత్సహించారు. మానవ సేవ మాధవ సేవ దృక్పథంతో విద్యాభ్యాసంలో అడుగిడి వైద్యునిగా ఎదిగి సమాజానికి నిరంతరం సత్వర సేవలు అందజేయడం కర్తవ్యంగా గుర్తించాలన్నారు. ఈ ఆస్పత్రితో కంధమల్ జిల్లాతో పొరుగున ఉన్న నయాగడ్, బౌధ్, కలహండి జిల్లాల ప్రజలకు కూడా ప్రయోజనం చేకూరుస్తుందన్నారు. స్థానిక ఉపాధి, పరిశోధన, ఆర్థిక అభివృద్ధికి ఇది శక్తివంతమైన ఇంజిన్గా పనిచేస్తుందన్నారు. ఈ సందర్భంగా కంధమల్ జిల్లా అభివృద్ధి కోసం సుమారు రూ.750 కోట్ల విలువైన 10 విభిన్న అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించి శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టుల్లోరూ. 655 కోట్లకు పైగా విలువైన 5 ప్రాజెక్టులను ప్రారంభించగా, రూ. 94 కోట్లకు పైగా విలువైన 5 ప్రాజెక్టులకు శంకు స్థాపన చేశారు. కంధమల్ జిల్లా జనాభాలో దాదాపు 54 శాతం మంది గిరిజన సమాజానికి చెందిన వారు ఉన్నారు. గిరిజనులకు అటవీ భూమి హక్కులను అందించడానికి జిల్లా యంత్రాంగం శ్రద్ధగా పని చేస్తోంది. అటవీ భూమి హక్కుల చట్టం కింద గత 6 నెలల్లో 20,000 పైబడి వ్యక్తిగత లీజులు జారీ చేశారు. రాష్ట్రంలో ఇక నుంచి భూమిలేని వ్యక్తి ఉండకూడదనే లక్ష్యంతో రానున్న రోజుల్లో జిల్లాలోని స్థలం వారందరికీ స్థలం కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కార్యక్రమంలో రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ముఖేష్ మహాలింగ్, కంధమల్ లోక్ సభ సభ్యుడు సుకాంత్ కుమార్ పాణిగ్రాహి, ఫుల్బాణి నియోజక వర్గం శాసన సభ సభ్యుడు ఉమా చరణ్ మల్లిక్ పాల్గొన్నారు.