
మూల్యం చెల్లించకతప్పదా!
శ్రీకాకుళం: రాష్ట్ర ప్రభుత్వం కరోనా పట్ల అవలంబిస్తున్న నిర్లక్ష్య వైఖరిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేసులు పెరుగుతున్నా అందుకు తగ్గట్లు నివారణ చర్యలు చేపట్టకపోవడంతో తగిన మూల్యం చెల్లించాల్సివస్తోందేమోనన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ హయాంలో కోవిడ్ నివారణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్న తరుణంలో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు అప్పట్లో తానే ముఖ్యమంత్రిగా ఉంటే కరోనా రాష్ట్రంలోకి వచ్చేదా అని ఓ బహిరంగ సభలో అనడం అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు ఆయనే ముఖ్యమంత్రిగా ఉండగా కరోనా నివారణకు కనీస చర్యలు చేపట్టకపోవడం విచారకరం. శ్రీకాకుళం జిల్లా వైద్యారోగ్యశాఖ కోవిడ్ పరీక్షా కిట్ల కోసం ప్రభుత్వానికి నివేదించి పది రోజులు కావస్తున్నా నేటికీ సరఫరా కాలేదు. కిట్ల కోసం ఎదురుచూసినా రిమ్స్ అఽధికారులు విశాఖపట్నం నుంచి పదుల సంఖ్యలో కిట్లను కొనుగోలు చేశారు. వ్యాధి లక్షణాలున్న అందరికీ కాకుండా తీవ్రమైన లక్షణాలు ఉన్నవారికి మాత్రమే పరీక్షలు జరుపుతున్నారు. కిట్ల కొరతే దీనికి కారణం.
విజయనగరంలో కలకలం..
పొరుగు జిల్లా విజయనగరంలో వ్యాధి లక్షణాలతో వచ్చిన ఓ రోగిని ఆసుపత్రిలో చేర్చి నిమోనియాగా చికిత్స చేస్తూ వచ్చారు. వారం రోజులైనా లక్షణాలు తగ్గకపోవడంతో రోగి నుంచి శాంపిల్ను సేకరించి పరీక్ష కోసం విశాఖపట్నం పంపించగా అతనికి కోవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. అప్పటికే ఆ రోగి పరిస్ధితి ఆందోళనకరంగా మారడంతో ఐసీయూలో ఉంచి చికిత్స జరుపుతున్నారన్న వార్త జిల్లాలో దావానంలా వ్యాపించింది. దీంతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మరోవైపు, ప్రజలు కూడా జాగ్రత్త చర్యలు చేపట్టాలని వైద్య వర్గాలు సూచిస్తున్నాయి. మాస్కులు ధరించడం, ఎప్పటికప్పుడు చేతులు శుభ్రం చేసుకోవడం, సామాజిక దూరం పాటించడం, జన సమూహాలున్న ప్రాంతాలకు తప్పనిసరైతే తప్ప వెళ్లకుండా ఉండటం వంటివి చేయాలని సూచిస్తున్నారు. వ్యాధి లక్షణాలుంటే తక్షణం వైద్యులను సంప్రదించాలని చెబుతున్నారు. జ్వరం, దగ్గు, గొంతునొప్పి, ఛాతిలో నొప్పితో ఒళ్లు నొప్పులు, కీళ్ల నొప్పులు వంటివి ఉంటే వైద్యుల సూచనల మేరకు మందులు వాడాలని సూచిస్తున్నారు.
ఒకటి రెండు రోజుల్లో..
ప్రభుత్వానికి కిట్ల విషయం నివేదించాం. ఒకటి రెండు రోజుల్లో వచ్చే అవకాశముంది. ర్యాపిడ్ కిట్లు 2500 వరకు ఉన్నాయి.
– డాక్టర్ కె. అనిత,
జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి, శ్రీకాకుళం
నేటికీ జిల్లాకు రాని కరోనా పరీక్ష కిట్లు
పొరుగు జిల్లాలో ఓ వ్యక్తికి కరోనాగా నిర్ధారణ
రాష్ట్ర వ్యాప్తంగా కేసులు పెరుగుతున్నా చలించని సర్కారు

మూల్యం చెల్లించకతప్పదా!