
ప్రభుత్వ తీరుపై ఉపాధ్యాయుల ఆందోళన
ఆమదాలవలస: ఉపాధ్యాయ సంఘాల ఉమ్మడి వేదికతో ఇటీవల జరిగిన చర్చలలో ఎస్జీటీలకు మాన్యువల్ కౌన్సెలింగ్ నిర్వహించడానికి అంగీకరించినప్పటికీ ఇప్పుడు వెబ్ కౌన్సిలింగ్ నిర్వహించాలని నిర్ణయించడం దుర్మార్గమైన చర్య అని ఐక్యవేదిక సంఘాల ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు శనివారం ఆమదాలవలస మండల విద్యాశాఖ అధికారి కార్యాలయం ఎదుట ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధ్యాయ వర్గాలకు ఆర్థికపరమైన అంశాలలో ప్రభుత్వం ఇప్పటి వరకు ఎటువంటి మేలు చేయలేదని, కనీసం ఆర్థికేతర అంశాలైన బదిలీలు కూడా మాన్యువల్గా నిర్వహించలేని నిస్సహయస్థితిలో ఉండడం శోచనీయమన్నారు. సరైన సౌకర్యాలు లేని కారణంగా మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహించలేమని చెప్పడం ప్రభుత్వం చేతకానితనానికి నిదర్శనమన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకొని ఎస్జీటీలకు మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహించాలని, లేనిపక్షంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఆదివారం డీఈఓ కార్యాలయ ముట్టడికి ఉపాధ్యాయులంతా హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు టి.వి.టి.భాస్కరరావు, బొడ్డేపల్లి గోపీచంద్, తమ్మినేని సీతారాం, కింతలి చంద్రరావు, నూక అప్పలనాయుడు, మెండ శ్యామలరావు తదితరులు పాల్గొన్నారు.