
యోగాంధ్ర ప్రత్యేక గీతం టీజర్ విడుదల
విజయవాడస్పోర్ట్స్: వోల్గా ఆర్చరీ అకాడమీ అధ్యక్షుడు చెరుకూరి సత్యనారాయణ నేతృత్వంలో యోగాంధ్రపై రూపొందించిన ప్రత్యేక గీతానికి సంబంధించిన వీడియో టీజర్ను శాప్ కాన్ఫరెన్స్ హాలులో గురువారం ఏపీ క్రీడా ప్రాధికార సంస్థ(శాప్) చైర్మన్ అనిమిని రవినాయుడు విడుదల చేశారు. ఈ సందర్భంగా రవినాయుడు మాట్లాడుతూ ఈనెల 21న 5 లక్షల మందితో విశాఖలో నిర్వహించనున్న యోగాంధ్ర కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారని తెలిపారు. వోల్గా ఆర్చరీ అకాడమీ స్వచ్ఛందంగా ముందుకొచ్చి ప్రత్యేక గీతాన్ని రూపొందించడం ప్రశంసనీయమన్నారు. వోల్గా ఆర్చరీ అకాడమీ అధ్యక్షుడు చెరుకూరి సత్యనారాయణ మాట్లాడుతూ ఏపీ స్పోర్ట్స్ అథారిటీ సహకారంతో ప్రపంచంలోనే యోగాపై తొలిసారిగా ప్రత్యేక గీతాన్ని రూపొందించా మన్నారు. ఈ గీతానికి తానే స్క్రిప్ట్ సిద్ధం చేశానని, రచయిత సుద్దాల అశోక్తేజ పాటను రచించారని, శ్రీకృష్ణ పాడారని వివరించారు. రెండురోజుల్లో పూర్తి పాట విడుదల చేస్తామని తెలిపారు. శాప్ డైరెక్టర్ సంతోష్ కుమార్, శాప్ ఏఓ వెంకటరమణ నాయక్, స్పోర్ట్స్ ఆఫీసర్లు, ఏడీలు పాల్గొన్నారు.