
ఎట్టకేలకు వక్ఫ్ భూముల కౌలు వేలం
పెనమలూరు: ఎన్నో ఏళ్లుగా పెత్తందారుల కబంధ హస్తాల్లో చిక్కుకున్న కొండపల్లి ఖాజీ వక్ఫ్ భూములకు అధికారులు ఎట్టకేలకు బుధవారం ఏక్సాల్ కౌలు వేలంపాట నిర్వహించారు.ఈ వేలం పాటలో జిల్లా నుంచి వచ్చిన 42 మంది రైతులు పోటాపోటీగా పాల్గొన్నారు. వక్ఫ్ భూములను రూ. 24,08,415కు నలుగురు కౌలుదారులు పాట దక్కించుకున్నారు. వివరాల్లోకి వెళితే తాడిగడప, పెదపులిపాక గ్రామాల్లో ఉన్న వక్ఫ్ భూములకు తహసీల్దార్ కార్యాలయంలో బహిరంగ కౌలు వేలంపాట నిర్వహించారు. మొత్తం 42 మంది రైతులు వేలంపాటలో ఒక్కొక్కరూ రూ.50 వేల ధరావత్తు చెల్లించి పాల్గొన్నారు. ఈ భూములకు 40 ఏళ్ల తరువాత మొదటిసారిగా కౌలు వేలంపాట నిర్వహించడం గమనార్హం.
వేలం పాట వివరాలు
పెదపులిపాక గ్రామంలో ఉన్న ఆర్ఎస్ నంబర్ 87లోని 12.59 ఎకరాలకు ఎకరా రూ.40,500 చొప్పున మొత్తం రూ 5,09,895లకు సయ్యద్ రెహమాన్ వేలంపాట పాడారు. తాడిగడపలోని ఆర్ఎస్ నంబర్ 79 లోని 11.41 ఎకరాలను జగ్గయ్యపేట ప్రాంతానికి చెందిన అష్రఫ్ రికార్డు స్థాయిలో ఎకరా రూ.లక్ష చొప్పున 11.41 ఎకరాలను 11.41 లక్షలకు పాట పాడారు. ఆర్ఎస్ నంబర్ 176లో 12.92 ఎకరాలను ఎకరా రూ.46 వేల చొప్పున రూ.5,94,320కు హుస్సేన్ అనే రైతు వేలంపాట పాడారు. ఆర్ఎస్ నంబర్ 173లోని 4.08 ఎకరాలను ఎకరా రూ.40 వేల చొప్పున రూ.1,63,200కు రైతు ఫతాఉల్లా వేలంపాటలో దక్కించుకున్నారు. వేలంపాట పాడిన వారికి కౌలు లీజు 11 నెలలు ఉంటుంది. అందరూ ముందుగానే సొమ్ము వక్ఫ్ బోర్డుకు చెల్లించాల్సి ఉంటుంది. టీడీపీ నేతలు వక్ఫ్ భూములు కై వసం చేసుకోవాలని వేలం పాటలో పాల్గొని విఫలమయ్యారు. వేలంపాటలో జిల్లా మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్ అబ్దుల్ రబ్బాని, వక్ఫ్ ఇన్స్పెక్టర్ నుహూ ఆలీషా, కొండ పల్లి ఖాజీ అబీబుల్లా హుస్సేని, వక్ఫ్ అధికారి కలీముల్లా పాల్గొన్నారు.
తుది నిర్ణయం కోర్టుదే...
వక్ఫ్ భూముల కౌలు వేలంపాట ముగియటంతో ఇక కోర్టు తుది ఉత్వర్వులతో కౌలుదారుల వద్ద సొమ్ము కట్టించుకుని 11 నెలలు భూమి కౌలు లీజుకు ఇస్తారు. గతంలో వక్ఫ్ భూముల్లో అనధికారికంగా సాగు చేసిన కొందరు ఏపీ హైకోర్టులో 2323/2025, 2324/2025 రిట్ పిటీషన్లు వేశారు. కోర్టు వక్ఫ్ భూములకు కౌలు వేలం నిర్వహించి వివరాలు తమ ముందు ఉంచాలని ఆదేశించింది. కౌలు వేలం పాట ముగియటంతో కోర్టు దృష్టికి వక్ఫ్ అధికారులు తీసుకు వెళతారు. అనంతరం కోర్టు అనుమతులతో భూములు కౌలుదారులకు అప్పగిస్తారు.
రూ.24 లక్షల ఆదాయం వేలంలో పాల్గొన్న 42 మంది 40 సంవత్సరాల తరువాత మోక్షం టీడీపీ నేతలకు చుక్కెదురు
40 ఏళ్లుగా నయా పైసా చెల్లించలేదు...
కొండపల్లి ఖాజీ,వక్ఫ్ భూములకు ఈ 40 ఏళ్లలో నయాపైసా కౌలు కొండపల్లి ఖాజీకి కాని, వక్ఫ్కు కాని చెల్లించలేదు. ఇప్పుడు కౌలు వేలం నిర్వహించటంతో కేవలం 11 నెలలకే రూ.24 లక్షల కౌలు ఆదాయం వచ్చింది. వక్ఫ్ భూముల కౌలు వేలంపై ‘సాక్షి’ లో వచ్చిన కథనాలు, వక్ఫ్ అఽధికారుల కృషితో న్యాయం జరిగిందని ముస్లిం సమాజం ఆనందం వ్యక్తం చేస్తోంది.