
నిత్య యోగాతో జీవితంలో నూతనోత్తేజం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ప్రతినిత్యం యోగా చేయడం ద్వారా జీవితంలో నూతనోత్తేజం కలుగుతోందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ అన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరికీ యోగాను చేరువచేసేందుకు థీమ్ యోగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. మంగళవారం బీఆర్టీఎస్ యోగా స్ట్రీట్లో జిల్లా అధికార యంత్రాంగం, ఆయుష్ శాఖ, విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఉపాధి హామీ శ్రామికులు, విశ్రాంత పోలీసు అధికారులతో కలిసి కలెక్టర్ యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి వర్గం ప్రజలకు యోగాపై అవగాహన కల్పించేందుకు థీమ్ యోగా నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా మంగళవారం ఉపాధి హామీ పథకం శ్రామికులతో పాటు విశ్రాంత పోలీసు అధికారులతో కలిసి యోగాసనాల అభ్యసన కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. కార్యక్రమంలో డ్వామా పీడీ ఎ.రాము, అసోసియేషన్ ఆఫ్ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్ అధ్యక్షుడు ఏఎస్ఎన్ రెడ్డి, కార్యదర్శి డాక్టర్ పి.హరికృష్ణ, కోశాధికారి డి.రాజారావు, లయన్స్ క్లబ్, సిద్ధార్థ కళాశాల యోగా శిక్షణ కేంద్రం సభ్యులు, డీఎంహెచ్వో డాక్టర్ ఎం. సుహాసిని, ఆయుష్ అధికారి డాక్టర్ రామత్లేహి తదితరులు పాల్గొన్నారు.
తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ
షేర్మహ్మద్పేట(జగ్గయ్యపేట): తాళం వేసి ఉన్న ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడిన ఘటన మంగళవారం గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన చల్లా లింగయ్య మంగళవారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి ఇంటికి తాళం వేసి పొలం పనులకు వెళ్లారు. మధ్యాహ్నం తిరిగి ఇంటికి వచ్చే సరికి తలుపులు తీసి ఉండటంతోపాటు బీరువాలోని రూ. 2.70 లక్షల నగదు కనిపించకపోవడంతో చిల్లకల్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్కడకు చేరుకున్న ఎస్ఐ తోట సూర్యశ్రీనివాస్ వివరాలు తెలుసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ