
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిలుపుదల చేయాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను తక్షణమే నిలుపుదల చేయాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి. విశాఖ ఉక్కు కార్మికులు చేస్తున్న సమ్మెకు మద్దతుగా సీఐటీయూ, ఏఐటీయూసీ, ఇఫ్టూ ఆధ్వర్యంలో విజయవాడ అలంకార్ సెంటర్లోని ధర్నాచౌక్ నందు సోమవారం ధర్నా నిర్వహించారు. ధర్నాలో పాల్గొన్న సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్సీహెచ్ శ్రీనివాస్, ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.రవీంద్రనాథ్, ఇఫ్టూ రాష్ట్ర నాయకుడు ప్రసాద్ మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పథకం ప్రకారం కార్మికులను తొలగించే యత్నాలను చేపట్టిందన్నారు. సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు మోదీ సేవ ఆపి కాంట్రాక్ట్ కార్మికుల సమ్మె పరిష్కారానికి కృషి చేయాలన్నారు. స్టీల్ ప్లాంట్ కార్మికులు తమ సమస్యల పరిష్కారానికి సమ్మె చేస్తున్నారని, ఈ సమ్మెను పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయన్నారు. జీతాల కోసం, క్రమబద్ధీకరణ కోసం కాకుండా ఉద్యోగ భద్రత కోసం సమ్మె చేస్తున్నారని నేతలు చెప్పారు. కార్మికులు జీవన్మరణ సమస్యగా భావించి పోరాటం చేస్తున్నారన్నారు. ఇప్పటికే కాంట్రాక్టు కార్మికులను 3వేల మందిని తొలగించారని, మరికొన్ని వేలమంది కార్మికులను తొలగించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ఇది అత్యంత దుర్మార్గమైన చర్య అన్నారు. స్టీల్ ప్లాంట్ పూర్తి సామర్థ్యంతో పనిచేసే స్థాయికి తీసుకురావడం, కొత్త బాయిలర్లను, ఫర్నిస్లను ఏర్పాటు చేయటం, ఉన్న ఉద్యోగులను తొలగించకుండా లాభాల్లో నడిపే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వం వెంటనే స్టీల్ ప్లాంట్ కార్మికుల సమ్మెను విరమింపచేసే చర్యలు చేపట్టాలని, తొలగించిన కాంట్రాక్టు కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, వారి ఇతర సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ధర్నాలో టీయూసీఐ రాష్ట్ర అధ్యక్షుడు మరీదు ప్రసాద్ బాబు, ఏసీసీటీయూ నాయకులు లక్ష్మణరావు, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఎ.వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షురాలు ఎన్సీహెచ్ సుప్రజ, జిల్లా నాయకులు ఏం.సోమేశ్వరరావు, ఇఫ్టూ నాయకుడు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.