
‘మాకు న్యాయం జరిగేలా చూడండి’
లబ్బీపేట(విజయవాడతూర్పు): కూటమి ప్రభుత్వం తమకు తీవ్ర అన్యాయం చేసిందని, న్యాయం జరిగేలా చూడాలని కోరుతూ ఎండీయూ ఆపరేటర్లు సోమవారం వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ను కలిసి విన్నవించారు. గుణదలలోని జిల్లా పార్టీ కార్యాలయంలో అవినాష్ను కలిసిన ఎండీయూ ఆపరేటర్లు పలు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందచేశారు. వినతిపత్రంలో మిడ్ డే మీల్స్, అంగన్వాడీల బకాయిలు ప్రభుత్వం చెల్లించాల్సి ఉందని, వెంటనే చెల్లించేలా ప్రశ్నించాలన్నారు. విజయవాడలో వరద బాధితులకు సహాయార్థం చేసిన వర్క్కు రావాల్సిన డబ్బులు తక్షణమే రిలీజ్ చేయించాలని, వాహనాల బీమా బకాయిల డబ్బులు రిలీజ్ చేయాలని, మొబైల్ క్యాంటీన్గా ఉన్న వెహికల్స్ని గూడ్స్ వెహికల్స్గా మార్చి క్లియరెన్స్ ఇప్పించాలన్నారు. వీటితో పాటు గత ప్రభుత్వంలో 90 శాతం రాయితీ, 10 శాతం తాము కట్టేలా ఒప్పందం జరిగిందని, కానీ ఇప్పుడు 30 శాతం డబ్బులు తమతో కట్టించుకున్నట్లు తెలిపారు.
బాధితులకు అండగా ఉంటాం..
కూటమి ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేస్తోందని దేవినేని అవినాష్ అన్నారు. గతంలో వలంటీర్లను తొలగించారని, ఇప్పుడు ఎండీయూ ఆపరేటర్లను తొలగించి ఉపాధి కోల్పోయేలా చేశారన్నారు. ప్రతి బాధితునికి వైఎస్సార్ సీపీ అండగా ఉంటుందని, న్యాయం జరిగే వరకూ పోరాడదామని ఆయన వారికి హామీ ఇచ్చారు. అవినాష్ను కలిసిన వారిలో విజయవాడలోని పలు ప్రాంతాలకు చెందిన ఎండీయూ ఆపరేటర్లు ఉన్నారు.