
భారత కాయక్, కెనోయింగ్ పోటీల్లో వర్షితరెడ్డి సత్తా
విజయవాడస్పోర్ట్స్: ఇండియన్ కాయక్ అండ్ కెనోయింగ్ పోటీల్లో విజయవాడ క్రీడాకారిణి గోగులూరి వర్షిత రెడ్డి ఐదు పతకాలు సాధించి సత్తా చాటింది. మచిలీపట్నంలో జరిగిన మసూల బీచ్ ఫెస్టివల్లో భాగంగా ఇండియన్ కాయక్ అండ్ కెనోయింగ్ అసోసియేషన్(ఐకేసీఏ) నిర్వహించిన పోటీల్లో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల క్రీడాకారులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం వహించిన వర్షితరెడ్డి అద్భుతమైన క్రీడా నైపుణ్యం ప్రదర్శించి సికాయక్ అండ్ స్టాండప్ పెడలింగ్ విభాగంలో రెండు సిల్వర్, మూడు బ్రాంజ్ మెడల్స్ గెలుచుకొని జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచింది. క్రీడాకారిణి వర్షితరెడ్డి విజయవాడలోని ఎన్ఎస్ఎం స్కూల్లో 9వ తరగతి చదువుతోంది. స్కూల్ ప్రిన్సిపాల్ రాయప్ప రెడ్డి, కోచ్లు ఎం.శ్రీనివాస్, తేజ ప్రోత్సాహంతో తాను ఈ విజయం సాధించినట్లు ఆమె పేర్కొంది. ఈ సందర్భంగా రాష్ట్ర కాయకింగ్ అండ్ కెనోయింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు బి.బలరాంనాయుడు, ఐకేసీఏ డైరెక్టర్ ఆర్.ప్రదీప్ నాయుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాయకింగ్ కెనోయింగ్ అసోసియేషన్ సెక్రటరీ శివారెడ్డి వర్షితను అభినందించారు. భవిష్యత్తులో అంతర్జాతీయ క్రీడా వేదికపై రాణించి రాష్ట్ర ఖ్యాతిని చాటాలని వారు ఆకాంక్షించారు.