
ఇష్టం లేకపోతే బయట పని చూసుకోండి
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): కేశఖండనశాలలో సిబ్బంది పని తీరుతో దేవస్థానానికి చెడ్డ పేరు వస్తే క్షమార్హం కాదు.. సేవా దృక్పథం ఉండాలి...లేనప్పుడు బయట వేరే పనులు చూసుకోండి.. భక్తుల నుంచి ఫిర్యాదులోస్తే అదే రోజు ఉద్యోగం నుంచి బయటకు పంపడమే కాదు పోలీసులకు సైతం ఫిర్యాదు చేస్తాం...ఉద్యోగం లేని రోజు.. ఎలా ఉంటుందో ఊహించుకోండని దుర్గగుడి ఈవో శీనానాయక్ హెచ్చరించారు. మహా మండపం ఆరో అంతస్తులో దుర్గగుడి కేశ ఖండనశాల సిబ్బంది, ప్రైవేటు సెక్యూరిటీ సిబ్బందితో శనివారం ఆయన సమావేశమయ్యారు. భక్తులను ఇబ్బంది పెడితే విధుల నుంచి తొలగిస్తామని హెచ్చరించారు. శనివారం రెండు వీడియో ఫిర్యాదులు తన వద్దకు వచ్చాయని, దేవదాయ చట్టం ప్రకారం నిబంధనలు కఠినంగా ఉన్నాయని, భక్తులను ఇబ్బంది పెట్టే వారిపై కేసు నమోదు చేయాల్సి ఉంటుందన్నారు. కేశఖండనశాలలో సిబ్బందికి ఇబ్బందులు, వేతనాల సమస్య ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఫిర్యాదులపై అన్ని కోణాల్లో విచారి స్తామని, సిబ్బంది తప్పు ఉంటే చర్యలు తీసుకుంటామన్నారు.
భక్తులను గౌరవిస్తే
ఆలయానికి మంచిపేరు
భక్తులను గౌరవించాలని, ఆప్యాయతను చూపిస్తే ఆలయానికి మంచి పేరు వస్తుందని ప్రైవేటు సెక్యూరిటీ సిబ్బందికి ఈవో సూచించారు. దాదాపు నెల రోజుల నుంచి సెక్యూరిటీ సిబ్బందిని గమనిస్తున్నానని, యాంత్రికంగానే ఉద్యోగం చేస్తున్నట్లు కనిపిస్తోందన్నారు. సుమారు వెయ్యి మంది సిబ్బంది ఉన్న ఆలయంలో భక్తులతో ఎలా ప్రవర్తిస్తున్నామో ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు. కొంత మంది సిబ్బంది తీరుతో దేవస్థానానికి చెడ్డ పేరు వస్తుందన్నారు.