
అమ్మ సన్నిధిలో అన్నీ నగదు లావాదేవీలే!
పెనుగంచిప్రోలు:ప్రతి ఒక్కరూ నేడు నగదు రహిత లావాదేవీలకు అలవాటై పోయారు. కొద్ది మొత్తం నగదుతో ప్రయాణాలు సాగిస్తున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రంగా వెలుగొందుతున్న పెనుగంచిప్రోలు తిరుపతమ్మవారి ఆలయంలో మాత్రం డిజిటల్ చెల్లింపులు అందుబాటులో లేవు. దీంతో భక్తులు కొంత ఇబ్బందులకు గురవుతున్నారు. డిజిటల్ చెల్లింపుల ద్వారా భక్తులకు సౌలభ్యం కలగటమే కాకుండా ఆలయానికి కూడా ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. తిరుపతమ్మవారి ఆలయంలో దర్శనం టికెట్లు, వివిధ ఆర్జిత సేవా టికెట్లు, ప్రసాదాల కొనుగోలు, కేశఖండనశాల వంటి అన్ని సేవలకు నగదు చెల్లింపులు తప్పనిసరి. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి నిత్యం వేల సంఖ్యలో భక్తులు అమ్మవారి దర్శనానికి తరలి వస్తుంటారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు సరిపడా నగదు లేకపోతే వారి బాధలు చెప్పలేనివిగా ఉంటాయి. ముఖ్యంగా స్మార్ట్ఫోన్లు అధికంగా వినియోగించే యువత సరిపడా నగదు తెచ్చుకోక ఏటీఎంల కోసం గ్రామంలో కిలోమీటరు మేర నడుచుకొని వచ్చి నగదు డ్రా చేసుకుని తీసుకెళ్తున్నారు. ఆలయ కౌంటర్ల వద్ద ఫోన్ పే, గూగుల్పే, పేటీఎం వంటి సౌకార్యాలు లేకపోవటంతో ప్రతి అవసరానికి నగదు కోసం ఇతరులను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంది.
పెరగనున్న ఆదాయం....
డిజిటల్ పేమెంట్లు అందుబాటులో లేక పోవటంతో దేవస్థానం కొంత ఆదాయం నష్టపోతోందన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా నిత్యాన్నదాన పథకానికి, గోశాలలో గోవుల సంరక్షణకు విరాళాలు అందించే దాతలు చాలామంది ఉంటారు. ప్రస్తుతం వారంతా విరాళాలను నగదు, చెక్కు, డీడీ రూపంలో అందిస్తున్నారు. అయితే ఆలయానికి వచ్చిన తరువాత అమ్మవారి దర్శనం అనంతరం లేదా అన్నప్రసాదం స్వీకరించిన తరువాత ఆలయ ప్రాంగణంలో గోపూజ అనంతరం విరాళం ఇవ్వాలని భక్తులు భావిస్తుంటారు. అయితే చేతిలో నగదు అందుబాటులో లేకపోవటం, డిజిటల్ సేవలు లేక విరాళం ఇవ్వలేక వెళ్లిపోతున్నారు. డిజిటల్ చెల్లింపుల కోసం కౌంటర్ల వద్ద ప్రతిరోజూ భక్తులు అడుగుతుంటారు. డిజిటల్ చెల్లింపులతో చిన్న మొత్తం నుంచి పెద్ద మొత్తం వరకు విరాళాలు స్వీకరించే అవకాశం ఉంటుంది. అయితే ప్రస్తుతం జరుగుతున్న సైబర్ మోసాల నేపథ్యంలో డిజిటల్ చెల్లింపుల అమలులో అనేక సాంకేతిక సమస్యలతో పాటు నగదు దుర్వినియోగం కూడా జరిగే అవకాశం ఉంటుందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారు చెబుతున్నది సరైనదే అయినప్పటికీ పటిష్టమైన భద్రతా ప్రమాణాలతో కూడిన అత్యాధునిక సాప్ట్వేర్ వినియోగించి సమస్యను అధిగమిస్తే భక్తులకు సౌకర్యంగా ఉంటుందని అంటున్నారు.
ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు అవసరం...
విరాళాలు, వివిధ సేవల కోసం ఆలయ ఆవరణలో ప్రత్యేక ఏర్పాటు లేక పోవటంతో భక్తులు విరాళాలు ఎవరికి ఇవ్వాలో, ఎక్కడ ఇవ్వాలో అర్థం కాక ఇబ్బందులు పడుతున్నారు. ప్రత్యేకంగా విరాళాల కౌంటర్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. అలాగే ఆలయంలో ఎంతో ప్రాధాన్యత కలిగిన నగదు లావాదేవీలు జరిగే చోట రెగ్యులర్ ఉద్యోగులు విధుల్లో ఉండకుండా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులతో పాటు ఎవరో ఒకరిని అక్కడ ఉంచి వెళ్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
డిజిటల్ పేమెంట్లు లేక భక్తుల అవస్థలు విరాళాల సమర్పణలో నగదు రహిత చెల్లింపులతో మేలు భక్తులకు సౌకర్యంతో పాటు ఆలయానికి ఆదాయం