
హైడ్రా తరహాలో బుడమేరు ఆపరేషన్ నిర్వహించాలి
గాంఽధీనగర్(విజయవాడసెంట్రల్): ౖహెదరాబాద్ హైడ్రా తరహాలో నగరంలో బుడమేరు ఆపరేషన్ చేపట్టాలని రౌండ్టేబుల్ సమావేశంలో వక్తలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆపరేషన్ బుడమేరు చేపట్టాలని కోరుతూ ఈ నెల 14న నిరసన దీక్ష చేపట్టాలని సమావేశం తీర్మానించింది. గాంధీనగర్ రామా ఫంక్షన్ హాల్లో శుక్రవారం సీపీఐ ఎన్టీఆర్ జిల్లా సమితి ఆధ్వర్యంలో ఆపరేషన్ బుడమేరును అమలు పరచాలని కోరుతూ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ గతేడాది బుడమేరు వరదల వల్ల విజయవాడ పట్టణంతో సహా పలు గ్రామాలు, పంట పొలాలు దెబ్బతిని ప్రజలు తీవ్రంగా నష్టపోయారని చెప్పారు. అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం ఆపరేషన్ బుడమేరు చేపట్టాలని నిర్ణయించిందని, కానీ ఏడాది కావస్తున్నా ఆచరణకు నోచుకోలేదన్నారు. బుడమేరు డైవర్షన్ కాల్వ మరమ్మతులు అరకొరగా చేపట్టి చేతులు దులుపుకుంటున్న పరిస్థితి ఉందని ధ్వజమెత్తారు. వర్షాకాలం ప్రారంభమవుతున్న నేపథ్యంలో యుద్ధ ప్రాతిపదికన నిధులు కేటాయించి బుడమేరు ప్రక్షాళన పనులు చేపట్టాలని కోరారు. విశ్రాంత ఇరిగేషన్ అధికారి కంభంపాటి పాపారావు మాట్లాడుతూ బుడమేరు వరద నివారణకు శాశ్వతమైన పరిష్కారాలు చేపట్టడానికి ప్రభుత్వం ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ పైభాగాన అవసరమైన జలాశయాలు నిర్మించి వరద ముంపును కొంతమేరకు తగ్గించే వీలుంటుందని చెప్పారు. రాయనపాడు నుంచి గుంటుపల్లి మీదుగా కృష్ణానదికి మరొక డైవర్షన్ చానల్ ఏర్పాటు చేయాలని సూచించారు. సమావేశంలో ఇఫ్టూ నాయకులు ప్రసాధ్, రైతు సంఘం ప్రధాన కార్యదర్శి కేవీవీ ప్రసాద్, సీపీఐ సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జి. ఈశ్వరయ్య, జి కోటేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు బొర్రా కిరణ్, నగర అధ్యక్షులు నరహరిశెట్టి నరసింహారావు, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి. జమలయ్య,విద్యార్థి, యువజన, మహిళా, రైతు సంఘాల నాయకులు పాల్గొన్నారు.
రౌండ్టేబుల్ సమావేశంలో వక్తల డిమాండ్