
కృష్ణానదిలో దూకి వ్యక్తి మృతి
కంచికచర్ల: అనుమానాస్పదస్థితిలో లారీ యజమాని కృష్ణానది పడి మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు కంచికచర్లకు చెందిన దేవిరెడ్డి నాగరాజు (41)లారీలు నడుపుకుంటూ జీవిస్తున్నాడు ఇతరుల వద్ద కొంత అప్పుగా తీసుకుని లారీలు కొనుగోలు చేశాడు. చేసిన అప్పులు తీరతాయోలేదోనని మనస్తాపం చెంది సూసైడ్ నోటు రాసుకుని మరీ ఇబ్రహీంపట్నం ఫెర్రీ వద్ద కృష్ణానదిలో గురువారం దూకాడు. ఈ విషయం తెలుసుకున్న స్ధానికులు పోలీసులు, రెవెన్యూ అధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఇబ్రహీంపట్నం పోలీసులు రంగంలోకి దిగి గజ ఈతగాళ్లను పిలిపించి కృష్ణానదిలో నాగరాజు కోసం వెతుకులాట ప్రారంభించారు. రాత్రి సమయం కావటంతో తిరిగి శుక్రవారం కృష్ణానదిలో గాలింపు చర్యలు చేపట్టారు. కొంత సేపటి తర్వాత నాగరాజు మృతదేహం లభ్యమయింది. ఆ మృతదేహాన్ని కంచికచర్ల స్వగృహానికి తీసుకువచ్చారు. కంచికచర్ల పోలీస్స్టేషన్లో సూసైడ్ నోట్ ప్రకారం నాగరాజు తమ్ముడు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహనరావు నాగరాజు మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. పరామర్శించిన వారిలో వైఎస్సార్ సీపీ పట్టణ అధ్యక్షుడు వేమా సురేష్బాబు, దేవరకొండ గురవయ్య, కాలవ పెదబాబు తదితరులు ఉన్నారు.
బీటెక్ ఎనిమిదవ సెమిస్టర్ ఫలితాలు విడుదల
కోనేరుసెంటర్: కృష్ణా విశ్వవిద్యాలయం పరిధిలోని అనుబంధ కళాశాలలకు సంబంధించిన బీటెక్ ఎనిమిదో సెమిస్టర్ ఫలితాలను విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య కూన రాంజీ శుక్రవారం విడుదల చేశారు. 204 మంది రెగ్యులర్ విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా నూటికి నూరు శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు వీసీ తెలిపారు. పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ పీవీ బ్రహ్మచారి పాల్గొని ఫలితాలకు సంబంధించిన పూర్తి వివరాలను ( www.kru.ac.in) వెబ్సైట్లో పొందుపరచినట్లు తెలిపారు.