
యోగాతో ఒత్తిడి రహిత జీవితం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఒత్తిడి రహిత జీవితానికి యోగా దోహదపడుతోందని, డయాబెటీస్, హైపర్ టెన్షన్, స్థూలకాయం వంటి జీవనశైలి రుగ్మతల నుంచి యోగా రక్షణ కల్పిస్తుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. యోగాంధ్ర–2025 మాసోత్సవాల సందర్భంగా శుక్రవారం విజయవాడలోని బీఆర్టీఎస్ రోడ్డు యోగాస్ట్రీట్ నందు జిల్లా అధికార యంత్రాంగం, నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో విజయవాడ బార్ అసోసియేషన్ భాగస్వామ్యంతో న్యాయవాదుల థీమ్ యోగా నిర్వహించారు. కలెక్టర్ లక్ష్మీశ విజయవాడ బార్ అసోసియేషన్ సభ్యులతో కలిసి యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని, ముఖ్యమంత్రి మార్గనిర్దేశంతో భారతదేశ వారసత్వ సంపద అయిన యోగాను సమాజంలోని ప్రతి వర్గానికి చేరువచేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగా రోజుకో వర్గ ప్రజలతో థీమ్ యోగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. శుక్రవారం లాయర్లతో థీమ్ యోగా నిర్వహించారు. కామన్ యోగా ప్రోటోకాల్లో చాలా సరళమైన ఆసనాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఆర్డీవో కావూరి చైతన్య, బెజవాడ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఏకే బాషా, సెక్రటరీ కేవీ రంగారావు, మాజీ కార్యదర్శులు జున్ను శ్రీధర్, పుప్పాల శ్రీనివాసరావు, సభ్యులు పి.జయలక్ష్మి, టి.హరికృష్ణ, డీఎంహెచ్వో డాక్టర్ ఎం.సుహాసిని, ఆయుష్ అధికారులు డాక్టర్ వి.రాణి, డాక్టర్ రామత్లేహి, డాక్టర్ రత్నప్రియదర్శిని, యోగా ట్రైనర్లు సత్యనారాయణ, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ లక్ష్మీశ